అమ్మ జయలలిత ఈజ్ ఫైన్: సినీ నటుడు, దర్శకుడు సీమాన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్షేమంగానే ఉన్నారని, ఆందోళన చెందనవసరం లేదని తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే అమ్మ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
గురువారం నామ్ తమిళర్ కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు, ప్రముఖ దర్శకుడు సీమాన్ అపోల్ ఆసుపత్రి దగ్గరకు వెళ్లారు. జయలలితను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే ఆసుపత్రి వర్గాలు లోపలికి వెళ్లడానికి ఆయనకు అనుమతిఇవ్వలేదు.
తరువాత ఆయన ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు. అనంతరం అపోలో ఆసుపత్రి బయట సీమాన్ మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు చెప్పారని మీడియాకు చెప్పారు.
అమ్మ కలకాలం సంతోషంగా ఉండాలని, ప్రజలకు సేవ చెయ్యడానికి ఆమె త్వరగా కొలుకోని ఇంటికి రావాలని సీమాన్ దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్బంలో నామ్ తమిళర్ కచ్చి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు.
క్యూకట్టిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు
తమిళనాడు సీపీఐ నాయకుడు పాండియన్ గురువారం అపోలో ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి సీఎం జయలలిత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందరాదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని పాండియన్ మీడియాకు చెప్పారు. తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే నాయకులు ఆసుపత్రిలోకి వెళ్లి అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.