పన్నీర్ సెల్వం VS శశికళ: చీలిక దిశగా అన్నా‘ఢీ’ఎంకే
చెన్నై: జయలలిత మృతితో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఆధిపత్య పోరు మొదలైయ్యింది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయ కుమార్ బహిరంగంగా నెచ్చెలి శశికళ మీద ఆరోపణలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో చిన్నమ్మ మీద కార్యకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
అన్నాడీఎంకే మంత్రులు, శాసన సభ్యులు చిన్నమ్మ భజన చేస్తున్నా ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు శశికళ మీద బహిరంగంగానే మండిపడుతున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు శశికళకు అప్పగించరాదని పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
మొన్నటి వరకు శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కొత్త నినాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు.
పన్నీర్ సెల్వంకు ఎంజీఆర్ ఫ్యామిలీ మద్దతు: శశికళకు షాక్
అన్నాడీఎంకే సీనియర్ నేతలు శశికళకు మద్దతు పలుకుతుంటే జిల్లా, మండల స్థాయి నేతలు అందుకు భిన్నంగా స్పందిస్తూ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ దెబ్బతో అన్నాడీఎంకే పార్టీ చీలక దిశగా వెళ్లే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పలువురు మంత్రులు, జిల్లా నేతలతో కలిసి అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఇప్పటికే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని తీర్మానించారు. నేను చెప్పినా ఇప్పుడు మళ్లీ వేరేవారి పేరు తెరమీదకు ఎందుకు తీసుకు వస్తున్నారు అని మధుసూదనన్ మండిపడుతున్నారు.
డిసెంబర్ 29వ తేది సాయంత్రం చెన్నై నగర శివారల్లోని శ్రీవారి కల్యాణమండపంలో అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని ఇప్పటికే నాయకులకు చెప్పారు. శశికళకు అనువుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి నిబంధనల్లో సవరణలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, అధికార ప్రతినిధి పొన్నయన్ ఇప్పటికే చెప్పారు.
శశికళ ఎవరు ? పోయెస్ గార్డెన్ లో ఎందుకు పోలీసులు: స్టాలిన్
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ తీసువచ్చిన నిబంధనలను జయలలిత పాటించారని, ఇప్పుడు కేవలం శశికళ కోసం పార్టీ నియమాలలో ఎలా మార్చులు చేస్తారు ? అని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
విళుపురం జిల్లా అవలూర్ పేట్లైలో అన్నాడీఎంకే పార్టీ పట్టణ కార్యదర్శి సాదిక్ బాష సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వంనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేద్దాం అని పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. ఈ దెబ్బతో చుట్టుపక్కల జిల్లాలో శశికళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫక్ల్సీలు ఏర్పాటు చేశారు.
ఎంజీఆర్ బంధువు సుధా విజయ్ కుమార్ సైతం సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వంనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఇటీవల డిమాండ్ చేశారు. ఈ సమయంలో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.
అన్నాడీఎంకేలో తిరుగుబాటు నేతలు తెరమీదకు వస్తే పార్టీ రెండుగా చీలిపోతుందని నాయకులే స్వయంగా అంటున్నారు. ఈ సమయంలో ఏమీ చెద్దాం దేవుడా అంటూ శశికళ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
పన్నీర్ సెల్వంకు పదవీ గండం ? ఏం చేద్దాం, కన్నెర్ర చేస్తే!
ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ తమిళనాడులో అనతి కాలంలోనే బలోపేతం అయ్యింది. ఎంజీర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 1987 డిసెంబర్ 24వ తేదీన ఆయన మరణించారు. ఆ సమయంలో ఎంజీఆర్ వారసులు ఎవరూ అనే విషయంలో పార్టీ రెండుగా చీలిపోయింది.
అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత ఎమ్ఆర్. వీరప్పన్ మద్దతుతో ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ సీఎం అయ్యారు. 33 మంది శాసన సభ్యులు జయలలితకు మద్దతు పలకడంతో జానకీ రామచంద్రన్ ప్రభుత్వం ఒక్క నెల పూర్తి కాకముందే కుప్పకూలిపోయింది.
తరువాత జరిగిన శాసన సభ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ చెయ్యడంతో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరిగితే అన్నాడీఎంకే పార్టీ అధికారం కొల్పోవడంలో ఏలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.