జయలలిత ఆరోగ్యం విషమం ? కేఎస్ఆర్ టీసీ బస్సులు స్టాప్
బెంగళూరు/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితకు గుండెపోటు రావడంతో ఆమెను అపోలో ఆసుపత్రిలోని ఐసీయు వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక నుంచి తమిళనాడు వెలుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సులను ఆదివారం రాత్రి నుంచి తాత్కాలికంగా ఎక్కడికక్కడ నిలిపివేశారు.
ఆదివారం రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో కేఎస్ఆర్ టీసీ బస్సులు తమిళనాడుకు పంపించడం మంచిది కాదని కేఎస్ఆర్ టీసీ అధికారులు భావించారు.
తమిళనాడులో ఆందోళనలు జరిగితే పరిస్థితులు అదుపుతప్పుతాయని, అందువలన బస్సులకు ఏదైనా జరగరానిది జరిగితే సంస్థకు నష్టం వస్తుందని అధికారులు భావించారు. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడుకు వెలుతున్న బస్సులను పలుచోట్ల తాత్కాలికంగా నిలిపివేశారు.
ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడులో ఉన్న కేఎస్ఆర్ టీసీ బస్సులను వెంటనే కర్ణాటకకు తీసుకురావాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దు (హోసూరు సమీపంలోని అత్తిబెలే) దగ్గర పోలీసులు గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.