దిల్లీకి దళపతి.. ప్రధానితో సీఎం విజయ్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 'తమిళగ వెట్రి కజగం' అధినేత సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం (మే 27) జరగనున్న ఈ పర్యటన దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధుల విడుదలపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే, కేంద్రంలో తమ కూటమికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సీఎం విజయ్ సమావేశమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. సీఎం పర్యటనకు సంబంధించి రాష్ట్ర హోం కార్యదర్శితో పాటు పలువురు సీనియర్ అధికారులు ఇప్పటికే ఢిల్లీలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేవలం రాజకీయ భేటీలకే పరిమితం కాకుండా, ఢిల్లీలోని ప్రసిద్ధ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) ఆవరణలో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రముఖ తమిళ కవి, సంత్ తిరువళ్ళువర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఆవిష్కరించనున్నారు.

ద్రావిడ కోటలో సరికొత్త శకం..
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చలాయించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ.. ఈ నెల ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒంటరిగా బరిలోకి దిగి 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టీవీకే.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 10న విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది వారాలకే ఈ తొలి ఢిల్లీ పర్యటన ఖరారు కావడం విశేషం.
కీలక శాఖలు సీఎం వద్దే.. ఏఐ (AI) కి ప్రత్యేక ప్రాధాన్యత!
తమిళనాడు కొత్త మంత్రివర్గంలో శాఖల కేటాయింపులను ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. పరిపాలనపై పూర్తి పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి విజయ్ హోం, పోలీస్, మున్సిపల్ పరిపాలన, పట్టణ-జల సరఫరా, మహిళా సంక్షేమంతో పాటు ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
దేశంలోనే రెండో రాష్ట్రంగా రికార్డ్..
సాంకేతికతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కేరళ తర్వాత మంత్రివర్గ స్థాయిలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా తమిళనాడును నిలిపారు. ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సేవల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కుమార్ ఆర్కు అప్పగించగా.. రెవెన్యూ శాఖను కేఏ సెంగోట్టయ్యన్కు, ఆర్థిక శాఖను ఎన్. మేరీ విల్సన్కు కేటాయించారు.
వారసత్వ, సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ టెక్నాలజీ, సంక్షేమం మేళవింపుగా సాగుతున్న సీఎం విజయ్ సరికొత్త పాలన.. ఈ ఢిల్లీ పర్యటన ద్వారా కేంద్రంతో ఎలాంటి సంబంధాలను నెలకొల్పుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications