దానిపై కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడదాం: వైఎస్ జగన్కు స్టాలిన్ లేఖ: ఆ రాష్ట్రాలకు చేటు
చెన్నై: కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టదలిచిన ఓ బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా నిరసిస్తోన్నారు. ఆ బిల్లు చట్టరూపం దాల్చితే తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్ర నష్టాన్ని కలుగుతుందనేది ఆయన వాదన. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతోన్నారు. ఈ దిశగా కూటమి కట్టే ప్రయత్నం చేస్తోన్నారు. ఆయన ప్రయత్నాలు ఎంత వరకు సఫలమౌతుందనేది ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందన మీద ఆధారపడి ఉంది.

ఏంటా బిల్లు..
ప్రస్తుతం అమల్లో ఉన్న ఓడరేవుల చట్టంలో సవరణలను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ముసాయిదా బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే.. చట్టరూపాన్ని దాల్చుతుంది. సవరణలతో కూడిన ఓడరేవుల చట్టం 2021 అమల్లోకి వస్తుంది. ఈ చట్టం- తీర ప్రాంత రాష్ట్రాల హక్కులకు తూట్లు పొడుస్తుందనే ఆందోళనను ఎంకే స్టాలిన్ వ్యక్తం చేస్తోన్నారు. ఓడరేవులు, అందులో సాగే కార్యకలాపాలపై ఇప్పటికే సర్వ హక్కులనూ కేంద్రం స్వాధీనం చేసుకుందని, ఇప్పుడున్న అరకొర అధికారాలు కూడా కేంద్రం వశమౌతాయని ఆయన చెబుతున్నారు.

ఎవరికెవరికి లేఖ..
దేశంలో తీర ప్రాంత రాష్ట్రాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి. ఏపీ-వైఎస్ జగన్, గుజరాత్-విజయ్ రుపాణీ, మహారాష్ట్ర-ఉద్ధవ్ థాకరే, గోవా-ప్రమోద్ సావంత్, కర్ణాటక-బీఎస్ యడియూరప్ప, కేరళ-పినరయి విజయన్, ఒడిశా-నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్- మమతా బెనర్జీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిలకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల్లో మేజర్, మైనర్ పోర్టులు ఉన్నాయి. అందులో కొనసాగే లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై రాష్ట్రాలకు కొంత వరకు అధికారాలు ఉన్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తరువాత.. ఓడరేవుల నుంచి పన్నుల రూపంలో అందే ఆదాయం కేంద్రం చేతుల్లోకే వెళ్లింది.

మరింత నష్టం
ఓడరేవుల చట్టం 2021లో కేంద్ర ప్రభుత్వం తాజా చేపట్టదలిచిన సవరణల వల్ల తమ రాష్ట్రాల్లో ఉన్న ఓడరేవులపై ఆయా ప్రభుత్వాలన్నీ అధికారాలను కోల్పోతాయని స్టాలిన్ పేర్కొన్నారు. దీన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం ఐక్య కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉందని, సమష్ఠిగా పోరాడాల్సి ఉందని చెప్పారు. తాజా సవరణల వల్ల చిన్నతరహా ఓడరేవుల పైన కూడా రాష్ట్రాలకు అధికారం ఉండదని పేర్కొన్నారు.

ఇప్పటికే కేంద్రం దృష్టికి..
తాజా సవరణలపై ఇప్పటికే తమ అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. కొత్తగా కేంద్రం ప్రతిపాదించిన ఈ సవరణల వల్ల చిన్నతరహా ఓడరేవులపైన కూడా ఆయా రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళనను వ్యక్తం చేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ భేటీలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.. తమ నిరసనను తెలియజేయాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications