పన్నీర్ సెల్వం ఏకగ్రీవ ఎన్నిక: పవర్, ఒక్కడు టార్గెట్ , అసెంబ్లీలో ఢీ, డీఎంకేతో!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గంతో విలీనం అయిన తరువాత పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం మీద పట్టుసాధించడానికి విఫలయత్నం చేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ శాసన సభాపక్ష నేతగా పన్నీర్ సెల్వం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. గురువారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసన సభాపక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Recommended Video


శశికళ ఫ్యామిలీతో !
అన్నాడీఎంకే పార్టీలో ఉన్న నాయకులు ఎవ్వరూ ఇంత వరకూ జయలలిత, ఆమె నెచ్చలి శశికళకు ఎదురుతిరిగిన సందర్బాలు లేవు. జయలలిత మరణించిన తరువాత అందరూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు దాసోహం అన్నారు.

డీకొట్టిన పన్నీర్ సెల్వం
జయలలిత మరణం తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం దాదాపు రెండు నెలలపాటు ఉన్నారు. అయితే శశికళ, ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా పన్నీర్ సెల్వం దగ్గర రాజీనామా చేయించారు. ఆ సందర్బంలో పార్టీ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం శశికళతో ఢీకొట్టారు.

దినకరన్ పెత్తనం
2017 ఫిబ్రవరి నెలలో అన్నాడీఎంకే పార్టీ మీద పన్నీర్ సెల్వం తిరుగుబాటు చెయ్యడం, శశికళ జైలుకు వెళ్లడం, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. శశికళ జైలుకు వెళ్లే సమయంలో టీటీవీ దినకరన్ కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టడంతో ఆయన ఆ పార్టీ మీద, నాయకుల మీద పెత్తనం చెలాయించారు.

తట్టుకోలేకపోయారు
టీటీవీ దినకరన్ తిక్క చేష్టలకు, ఆయన పెత్తనాన్ని తట్టుకోలేకపోయిన సీఎం ఎడప్పాడి పళనిస్వామి చివరికి పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం అయ్యారు. తరువాత శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను పార్టీ నుంచి బహిష్కరించారు.

శశికళ ఫ్యామిలీ టార్గెట్
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్న టీటీవీ దినకరన్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా పన్నీర్ సెల్వంకు ఉండటంతో ఆయన్ను శాసన సభ నాయకుడిగా ఎన్నుకున్నారు. అసెంబ్లీలో దినకరన్, ప్రతిపక్షాల ఆరోపణలకు పన్నీర్ సెల్వం సరైన సమాధానం ఇస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.

నమ్మకం !
తనను అన్నాడీఎంకే శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పన్నీర్ సెల్వం చెప్పారు. శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్షాలకు, టీటీవీ దినకరన్ చేసే ఆరోపణలకు సరైన సమాధానం ఇవ్వడానికి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications