విధ్వంసానికి ఛాన్స్, జయ కోలుకునేదాకా రాష్ట్రపతి పాలన: స్వామి లేఖ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి గత పదిహేను రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు.
జయ అనారోగ్యం కారణంగా తమిళనాడులో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. జయ చికిత్స నిమిత్తం అందుబాటులో లేరని పేర్కొన్నారు.
అంతేకాదు, పాలన స్తంభించిందని, అదే సమయంలో రామంతాపురం, తిరునల్వేలి, మధురై, కన్యాకుమారిలలో ఐసిస్ స్లీపర్ సెల్స్ క్రియాశీలమవుతాయని చెప్పారు. అవి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే అవకాశముందన్నారు. రాష్ట్రపతి పాలన విధించకుంటే సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
అలాగే, జయలలిత తన విధులు నిర్వర్తించే వరకు.. ఓ ఆరు నెలల పాటు తమిళనాడులోని దక్షిణ జిల్లాలు, అలాగే చెన్నైలో ఆర్మ్డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్) యాక్ట్ (ఏఎఫ్ఎస్పీఏ)ను విధించాలని ఆ లేఖలో కోరారు. జయలలిత మరిన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని అపోలో వైద్య వర్గాలు కూడా వెల్లడించాయని సుబ్రహ్మణ్య స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు.