తమిళ ఎన్నికలు:కంటైనర్లలో రూ. 570 కోట్లు సీజ్, విశాఖ లింక్
కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నగదు వరదలై పారుతుంది. ఇప్పటికే తమిళనాడులో వివిధ పార్టీలకు చెందిన కోట్ల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్నికల అధికారులు ఒకే సారి వందల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం రాత్రి నాకాబంధీ చేపట్టిన ఎన్నికల అధికారులు, సంబంధిత పోలీసులు కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాలో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు బైపాస్ రోడ్డులో ఓ కంటైనర్ ను అధికారులు నిలిపారు. ఆ కంటైనర్ పరిశీలించగా అందులో రూ. 195 కోట్లు (నగదు) ఉన్న విషయం గుర్తించి సీజ్ చేశారు.
రూ. 570 కోట్ల మిస్టరీ: కంటైనర్ల వెనక 3 కార్లు, వెనక్కి తిప్పి చిక్కారు
తిరుపూర్ జిల్లాలో మూడు కంటైనర్లు నిలిపి పరిశీలించగా అందులో రూ. 570 కోట్లు ఉన్న విషయం గుర్తించి సీజ్ చేశారు. కోయంబత్తూరు నుంచి విశాఖకు ఈ కంటైనర్లు వెళుతున్నాయని అధికారులు అన్నారు. విశాఖలోని ఎస్ బీఐ బ్యాంకులో ఈ నగదు డిపాజిట్ చెయ్యడానికి తీసుకు వెలుతున్నామని విచారణలో డ్రైవర్లు చెప్పారని పోలీసు అధికారులు అంటున్నారు.
అయితే అందుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కంటైనర్లును స్వాధీనం చేసుకున్నారు. నగదు ఉన్న కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. ఈ నగదు విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ నెల 16వ తేదిన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నందున వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఓటర్లకు నగదు పంపిణి చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారు. గత గురువారం వరకు తమిళనాడులో ఎన్నికల అధికారులు రూ. 100 కోట్లు సీజ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఓ రాష్ట్రంలో రూ. 100 కోట్లు అక్రమ నగదు సీజ్ చెయ్యడం ఇదే మొదటి సారి. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 140 కోట్లు సీజ్ చేశారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రూ. 100 కోట్ల అక్రమ రవాణా నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపూర్ జిల్లాలో 3 కంటేనర్లలో పట్టుకున్న రూ. 570 కోట్ల భారీ నగదును విశాఖకు తరలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఆఫీసర్ రాజేశ్ లోహానీ తెలిపారు. కంటేనర్లకు సెక్యూర్టీగా వెళ్తున్న సిబ్బందికి సరైన దుస్తులు కూడా లేవని, వాళ్ల దగ్గర ఆ సొమ్ముకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు.
రూ.570 కోట్ల నగదుతో వెళ్తోన్న కంటేనర్ల గురించి ఎస్బీఐ అధికారులతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అయితే ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసినట్లు రాజేశ్ తెలిపారు. సెక్యూర్టీ సిబ్బంది దగ్గర కేవలం ఫోటో కాపీలు మాత్రమే ఉన్నాయని, వాళ్ల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని ఆయన స్పష్టం చేశారు.