32 ఏళ్ల తర్వాత జయలలిత సాధించారు: ఇవీ లెక్కలు
చెన్నై: వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రికార్డ్ సృష్టించారు. తమిళనాట ఇప్పటి దాకా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. కానీ జయలలిత దానిని తిరగరాశారు.
1967 వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. 1967లో అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి అధికారం చేపట్టింది. అన్నాదురై మరణానంతరం ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971లో జరిగిన ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు.
డీఎంకేను వీడి అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఎంజీఆర్ 1977లో శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టారు. 1980, 1984 ఎన్నికల్లో వరుసగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు జయ సాధించారు.
1989లో డీఎంకే, 1991లో అన్నాడీఎంకే, 1996లో డీఎంకే, 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే, 2011లో అన్నాడీఎంకేలు విజయం సాధించాయి. అంటే, గత ముప్పై రెండేళ్లుగా అధికార మార్పిడి జరుగుతోంది. ఇప్పుడు జయలలిత దానిని తిరగరాశారు.
రాష్ట్రంలో మొత్తం 232 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జయలలిత పార్టీ 140 స్థానాల వరకు గెలుచుకోనుంది. డీఎంకే - కాంగ్రెస్ కూటమి 90 స్థానాల వరకు గెలుచుకోనుంది. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోతోంది. సున్నాకే పరిమితం అవుతోంది.
తమిళనాట మొత్తంగా జయలలితదే హవా. కానీ చెన్నైలో మాత్రం గత ఏడాది వరద దెబ్బ పడింది. నగరంలో డీఎంకే పార్టీదే హవా. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో అన్నాడీఎంకే హవా ఏకపక్షంగా కనిపిస్తోంది. కొయంబత్తూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా అన్నాడీఎంకే 9, డీఎంకే 1 ఒకస్థానంలో ముందంజలో ఉన్నాయి.
మధురై జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా అన్నాడీఎంకే 8, డీఎంకే 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలో డీఎంకే 5, అన్నాడీఎంకే 4 స్థానాల్లో, సేలం జిల్లాలో 11 స్థానాల్లో అన్నాడీఎంకే 10, పీఎంకే ఒక స్థానంలో దూసుకెళ్తున్నాయి. విల్లుపురం జిల్లాలో డీఎంకే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
కరుణానిధి కంటే జయ ఒకటి ఎక్కువ
1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి అధిక్యం సాధించిన పార్టీగా అన్నాడీఎంకే చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు జయలలిత ఐదుసార్లు, కరుణానిధి ఐదుసార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే విజయం సాధించడం ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.