Tamil Nadu Exit Poll 2026: ఎగ్జిట్ పోల్స్ ఆలస్యం వెనుక ? రిలీజ్ ఎప్పుండంటే ?
తమిళనాడు అసెంబ్లీకి హోరాహోరీగా జరిగిన ఎన్నికలు ముగిశాయి. డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు విజయ్ కొత్త పార్టీ టీవీకే కూడా ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. దీంతో ఫలితాలపై జాతీయ స్ధాయిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ (Tamil Nadu Exit Poll 2026) ఫలితాలు విడుదల కాలేదు. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్ధాయిలో పోలింగ్ జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో 84.9% పోలింగ్ నమోదైంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం విధించిన నిషేధం కారణంగా ప్రస్తుతం విడుదల చేయలేని పరిస్ధితి నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాక, ఫలితాలు మాత్రం మే 4న అధికారికంగా వెలువడనున్నాయి. అయితే తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ విడుదలపై ఈసీ కఠిన ఆంక్షలు విధించింది. దీనికి ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్లో ఈ నెల 29న జరిగే రెండో విడత ఎన్నికలే.

తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే పశ్చిమ బెంగాల్లో జరిగే రెండో విడత ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందనేది ఎన్నికల కమిషన్ లెక్క. అందుకే తమిళనాడులో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కాకుండా అడ్డుకుంది. ఎవరైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించింది. అయితే విచిత్రంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలకూ ఏమాత్రం సంబంధం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీలే. ప్రాంతీయ పార్టీ అయిన టీఎంసీకి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో సంబంధం లేదు. అయినా జాతీయ పార్టీల ఇరుచోట్లా బరిలో ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం కారణంగా బెంగాల్లో రెండో దశ పోలింగ్ పూర్తయ్యాక 29న సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి.















Click it and Unblock the Notifications