జయలలితకు తిథి: ఎవరు చేశారంటే ? ఇక్కడా రాజకీయమా !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 11 రోజుల తిథి సంస్కారాలు పోయెస్ గార్డెన్ లో నిర్వహించారు. తిథి కార్యక్రమం మొత్తం నెచ్చెలి శశికళ కుటుంబ సభ్యులే చేశారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 11 రోజుల తిథి సంస్కారాలు నిర్వహించారు. జయలలితకు ప్రాణానికి ప్రాణం అయిన పోయెస్ గార్డెన్ లో శుక్రవారం జయలిత 11 రోజు తిథి కార్యక్రమాలు నిర్వహించారు.
జయలలిత నెచ్చెలి శశికళ నటరాజ్ కుటుంబ సభ్యులు, జయలలిత మేన అల్లుడు దీపక్ (సోదరుడు జయకుమార్ కుమారుడు), తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే నాయకులు అమ్మ తిథి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జయలలిత కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం 11 రోజుల తిథి సంస్కారాలు ఏర్పాటు చెయ్యడం అనవాయితి. అయితే తిథి కార్యక్రమం అంతా శశికళ కుటుంబ సభ్యులే చేశారు. పేరుకు మాత్రం దీపక్ అక్కడ ఉన్నాడు.
పోయెస్ గార్డెన్ లో తిథి కార్యక్రమం పూర్తి అయిన తరువాత అన్నాడీఎంకే శాసన సభ్యులు ఎక్కడికి వెళ్లకుండా చూడటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శాసన సభ్యులు అందరినీ మూడు ప్రత్యేక ఏసీ బస్సుల్లో అక్కడి నుంచి జయలలిత సమాధి దగ్గరకు తీసుకు వెళ్లారు.

మెరినా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద శశికళ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శశికళ స్వయంగా అన్నదానం చేశారు. జయలలిత తిథి సంస్కారాలకు ఆమె కుటుంబ సభ్యులు అందరినీ దూరం పెట్టారు. కేవలం దీపక్ ను మాత్రమే పిలవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్, చెన్నై మాజీ మేయర్ సైడై దురైస్వామి, పార్టీ సీనియర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద అంత్యక్రియలతో పాటు జయలలిత తిథి సంస్కారాలను సైతం శశికళ బంధు వర్గమే పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications