కోర్టులో లొంగిపోయిన పన్నీరు సెల్వం సోదరుడు
చెన్నయ్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న ఓ పన్వీరు సెల్వం సోదరుడు ఓ. రాజా ఒక కేసులో స్వచ్చందంగా కోర్టులో లొంగిపోయాడు. పూజారి ఆత్మహత్య కేసులో ఓ రాజా తదితరుల మీద కేసు నమోదు అయ్యింది.
పెరియకుళం సమీపంలోని ఒక గ్రామంలోని దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రాజ, అతని అనుచరులు ఒత్తిళ్లు, వేధింపుల కారణంగా నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
నాగముత్తు కుటుంబ సభ్యులు మధురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. అక్కడి నుండి తేని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లింది. విచారణకు హాజరు కావాలని రాజాతో పాటు 7 మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరు విచారణకు హాజరు కాలేదు.
వారెంట్లు జారీ అవుతున్నాయని తెలుసుకున్న పాండి అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయాడు. తరువాత బెయిల్ తీసుకున్నాడు. కళ్లు తెరిచిన పన్నీరు సెల్వం సోదరుడు రాజా కోర్టులో లొంగిపోవడానికి సిద్దం అయ్యాడు. అయితే మీడియా కంట పడరాదని ప్లాన్ వేసుకున్నాడు.
సొంత ఊరిలో అన్నా డీఎంకే పార్టీ నాయకులతో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీడియా అక్కడికి వెళ్లింది. రాజా కోర్టు వెనుక గేటు నుండి వెళ్లి కోర్టులో లొంగిపోయాడు. విచారణ కొంత సేపు జరిగింది. అయితే రాజాకు తొలుత బెయిల్ ఇవ్వలేదు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. భోజనం విరామం తరువాత రాజాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు.