పన్నీర్ సెల్వంకే వీరి మద్దతు: ప్రతిపక్షం టార్గెట్ శశికళ, కేంద్రం అండతో !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కన్ను వేసిన శశికళకు ఇప్పుడు పరిస్థితి మొత్తం ప్రతికూల వాతావరణంగా మారిపోయింది. సొంత పార్టీ అన్నాడీఎంకేలో ప్రతికూల పవనాలు వీస్తుండటంతో శశికళతో పాటు ఆమె వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడులో ఇన్నేళ్లు రాయి టెంకాయి లాగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల నాయకులు క్షణం తీరకలేకుండా ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకుంటున్నారు. అధికార దాహంతో పన్నీర్ సెల్వంను బలవంతంగా పదవి నుంచి పక్కకు తప్పించిన శశికళ మీద సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. .
పన్నీర్ సెల్వం రాజకీయ సన్యాసం ! బుజ్జగించే పనిలో శశికళ అండ్ కో
మేము తిరుగుబాటుకు సై అంటూ ఎమ్మెల్యేలు ఇప్పుడు పన్నీర్ సెల్వంకు జై కొడుతున్నారు. పన్నీర్ సెల్వం పనితీరుపై డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ సైతం సంతృప్తిగా ఉన్నారు. శశికళ సీఎం కావడానికి స్టాలిన్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
ప్రజాప్రతినిధులే సీఎం కావాలని గట్టిగా చెప్పిన స్టాలిన్ ఇప్పుడు శశికళ సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఢిల్లీలో మకాం వేశారు. ఎలాగైనా శశికళ సీఎం కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న స్టాలిన్ పరోక్షంగా పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నారు.
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇంతకు ముందే పన్నీర్ సెల్వంకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. వర్దా తుఫాను, జల్లికట్టు విషయంలో పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది. అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా గమనిస్తోంది.
మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం
శశికళను అడ్డుకోవడానికి స్టాలిన్ తన పార్టీ శాసన సభ్యులను పన్నీర్ సెల్వంకు అండగా పెట్టడానికి వెనకడుగు వెయ్యరని ఆయన సన్నిహితులు అంటున్నారు. అందరి లక్షం శశికళ సీఎం కాకుండా అడ్డుకోవడమే అని స్పష్టంగా కనపడుతోంది.
తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలు శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. జయలలిత మేనకోడలు దీపా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి శశికళ మీద విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన 31 మంది దళిత ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే అండతో పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో గంటగంటకు మారుతున్న రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి.