జయలలిత మృతి మిస్టరీ వీడేనా: విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వం, శశికళ బెదిరించారు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను నియమించింది. ప్రత్యేక కమిషన్ చైర్మన్ గా హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆరుముగస్వామిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక కమిషన్ విచారణలో జయలలిత మరణంపై మిస్టరీ వీడాలని అమ్మ అభిమానులు, తమిళనాడు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆశిస్తున్నారు. జయలలిత మరణంపై సవాలక్ష సందేహాలు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టింది. జయలలిత మరణంపై సీబీఐతో విచారణ చేయించాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నేతగా సంచలనం
సినీతారగా గుర్తింపు తెచ్చుకున్న జయలలిత తరువాత రాజకీయాల్లోకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనాలకు తెరతీశారు. రాజకీయ నాయకురాలు అంటే జయలలిత అని దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సంచలన నిర్ణయాలతో తమిళనాడు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

జయ మరణంపై సవాలక్ష సందేహాలు
రాజకీయ నాయకురాలిగా సంచలనాలకు కేంద్రబింధువు అయిన జయలలిత ఆమె మరణం అంతకంటే సంచలనం కలిగించింది. స్వల్ప అనారోగ్యం కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అర్దరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన మృతురాలిగా బయటకు వచ్చారు.

నాయకుల అసత్య ప్రచారం
అమ్మ కోలుకుంటున్నారని, చికిత్సకు సహకరిస్తున్నారని అన్నాడీఎంకే నాయకులుఅప్పట్లో ప్రజలకు చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ నాయకులు చెప్పింది ఒకటి, చివరికి జరిగింది ఒకటి. జయలలిత మృతి చెందారని తెలుసుకున్న తమిళనాడు ప్రజలు ఆర్తనాదాలు చేశారు.

ఒక్క ఫోటో విడుదల చెయ్యలేదు ?
జయలలిత కోలుకుంటున్నారని చెప్పిన నాయకులు అమ్మ చికిత్స పొందుతున్న సమయంలో ఒక్క ఫోటో తీసి ఎందుకు విడుదల చెయ్యలేదు అని ప్రజలు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. అమ్మ చికిత్స విఫలమై మరణించారా ? లేక తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారా ? అని తమిళనాడు ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు.

మంత్రి సంచలన వ్యాఖ్యలు
అమ్మ ఆసుపత్రిలో ఇడ్లీ, చెట్నీ తింటున్నారని తాము చెప్పింది అంతా అపద్దం అని, కేంద్ర మంత్రులతో సహ గవర్నర్ సైతం అమ్మను చూడలేదని, శశికళ వచ్చి జయలలిత కోలుకుంటున్నారని అందరికీ చెప్పి పంపించేవారని, ఆమెకు భయపడే మేము గతంలో అలా చెప్పాల్సి వచ్చింది అంటూ తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఇటీవల బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి వ్యాఖ్యలతో మరింత అనుమానం
మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఒకప్పుడు శశికళకు ప్రధాన అనుచరుడు. అలాంటి దిండుగల్ శ్రీనివాసన్ శశికళ మీద సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజల్లో మరింత అనుమానం వచ్చింది. మంత్రులు, నాయకులు అందర్నీ శశికళ బెదిరించేవారని మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ బాంబు పేల్చారు.

హైకోర్టులో పిటిషన్
జయలలిత మరణంపై ఇంత వరకూ విచారణ కమిషన్ వెయ్యలేదని శనివారం టీటీవీ దినకరన్ అనుచరుడు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్న సమయంలోనే తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి విచారణ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ గా హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆరుముగస్వామిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications