టీచర్లతో విద్యార్ధుల లవ్ ఎఫైర్స్: తమిళనాడులో మహిళా టీచర్లకు డ్రెస్ 'కోడ్'
చెన్నై: తమిళనాడులో మహిళా టీచర్లు, తమ స్టూడెంట్స్తో లేచిపోయిన సంఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూసిన అక్కడి ప్రభుత్వం ఇలాంటి పాశ్చత్య తరహా పోకడలను వెంటనే అరికట్టాలంటూ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
కదయనల్లూర్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గత మార్చి 31న ఓ 26 ఏళ్ల మహిళా టీచర్, 16 ఏళ్ల కుర్రాడిని ప్రేమించి అతడితో పారిపోయింది. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత దిండుగల్ జిల్లాలోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో 22 ఏళ్ల మహిళా టీచర్, 20 ఏళ్ల అబ్బాయితో పారిపోయింది. ఈ రెండు సంఘటనలతో తమిళనాడులో పెద్ద దుమారం చెలరేగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు వ్యవహారాలు సమస్యాత్మకం అవడంతో విద్యాశాఖ అధికారులు వెంటనే ఓ కమిటీని వేశారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్లను పిలిపించి రాబోయే రోజుల్లో ఇలాంటి లవ్ ఎఫైర్స్ను అరికట్టడం ఎలా ? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంతోపాటు మహిళా టీచర్లకు 'ప్రవర్తనా నియమావళి'ని ఏర్పాటు చేయాలని మెజారిటీ సభ్యులు వారి అభిప్రాయాలను చెప్పారు.
చర్మం కనిపించేలా స్కర్టులు, టీ షర్టులు, జీన్ పాంట్ల లాంటి పాశ్చాత్య దుస్తులను లేడీ టీచర్లు ధరించరాదని, సామాజిక వెబ్సైట్ల ప్రభావం పెరిగిన నేపథ్యంలో తరగతి గదిలోకి వారు సెల్ఫోన్లు తీసుకురాకుండా చేయాలని, లవ్ ఎఫైర్స్పై నిఘా ఉంచేందుకు విద్యా సంస్థల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమేరాలను అమర్చాలని 'తమిళనాడు హయ్యర్ సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఆంటోని అంబరసు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే, తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకురాకుండా చూడటం సమంజసమేనని, మహిలా టీచర్లకు డ్రెస్ కోడ్ నిర్దేశించడం ఎంత మాత్రం సరికాదని, ఇప్పుడు దీన్ని అనుమతిస్తే రాబోయే కాలంలో ముఖాలు కూడా కనిపించకుండా ముసుగులు వేసుకోమంటారని పోస్ట్గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మురుగన్ పేర్కొన్నారు.
చివరకు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మహిళా టీచర్లకు 'కోడ్', విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఓ పాఠశాలలో లేడీ టీచర్లంతా కలిసి 'వియ్ లవ్ అవర్ టీచర్స్' అనే అక్షరాల క్రమంలో విద్యార్థులను కూర్చోబెట్టారు.