ఆర్ టీసీ సమ్మె: అదనపు రైళ్లు, బస్సు డ్రైవర్ అయిన ఎమ్మెల్యే, ప్రభుత్వం వార్నింగ్!
చెన్నై: తమిళనాడు ఆర్ టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన నివరధిక సమ్మె శనివారంతో మూడోరోజుకు చేరుకుంది. దీంతో చెన్నై నగరంతో సహా తమిళనాడులోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రయివేటు బస్సులు, వాహనాల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

47 కార్మిక సంఘాలు
కార్మికుల జీతాలు పెంచాలనీ, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ఆర్ టీసీకి చెందిన 47 కార్మిక సంఘాలు గురువారం అర్దరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

చర్చలకు సిద్దం
గురువారం కార్మిక సంఘాల నాయకులతో తమిళనాడు రవాణా శాఖ మంత్రి ఎంఆర్, విజయ్ భాస్కర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని, వెంటనే విధులకు హాజరు కావాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా వారు మాత్రం పట్టించుకోవడం లేదు.

సంక్రాంతి ఎఫెక్ట్
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న సమయంలో ఆర్ టీసీ కార్మికులు నిరవదిక సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వంతో సహ ప్రజలు ఒక్క సారిగా హడలిపోయారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్షాలు, తమిళ సినీరంగ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వం వార్నింగ్
ఆదివారం లోపు విధులకు హాజరు కావాలని, లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు రవాణా శాఖ మంత్రి ఎంఆర్. విజయ్ భాస్కర్ కార్మిక సంఘాలను శుక్రవారం మద్యాహ్నం తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అదనపు రైళ్లు
మా సమస్యలు పరిష్కరించే వరకు తాము విధులకు హాజరుకామని ఆర్ టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆర్ టీసీ సమ్మె కారణంగా రైల్వే శాఖ అధికారులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మరన్ని అదనపు రైళ్లు నడుపుతున్నారు.

బస్సు నడిపిన ఎమ్మెల్యే
ఆర్ టీసీ కార్మికుల సమ్మెతో స్థానిక ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే కేఆర్. రాజక్రిష్ణన్ 18 కిలోమీటర్ల దూరం ఉన్న భవాని నుంచి అంతియూరు వరకు ఆర్ టీసీ బస్సు నడిపుతున్నారు. భవాని- అంతియూరు మధ్య ఆర్ టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే రాజక్రిష్ణన్ నడుపడంతో ప్రజలు ఆయన్ను అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications