ఎమ్మెల్యేలకు విజయకాంత్ షాక్, 'అంతా భార్య వల్లే'
చెన్నై: తమిళనాడులో నటుడు విజయకాంత్ పార్టీ డిఎండికెలో మరోసారి ముసలం పుట్టింది. పిడబ్ల్యూఎఫ్తో పొత్తు కుదుర్చుకోవాలన్న విజయకాంత్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమందిని పార్టీ నుంచి బహిష్కరించారు.
వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అప్రతిష్ట తెచ్చారని, పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నామి విజయకాంత్ మంగళవారం నాడు ప్రకటించారు. అసమ్మతిని సహించేది లేదని చెప్పేందుకే సీనియర్ నేతల పైన వేటు వేసినట్లుగా చెబుతున్నారు.
కాగా, డిఎండికెలో చీలిక ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ నేతలు మొదటి నుంచీ విజయ్కాంత్పై ఒత్తిడి తెచ్చారు.
కానీ ఆయన అనూహ్యంగా వైగో నేతృత్వంలోని ప్రజా సంక్షేమ కూటమితో జత కట్టడాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది జిల్లా కార్యదర్శులు, దిగువ శ్రేణి నేతలు డీఎంకేలో చేరిపోగా తాజాగా మంగళవారం అయిదుగురు శాసనసభ్యులు, పది మంది జిల్లా కార్యదర్శులు తిరుగుబాటు బాటపట్టారు.
అసంతృప్తుల బృందానికి డీఎండీకే ప్రచార కార్యదర్శి, ఈరోడ్ జిల్లా కార్యదర్శి చంద్రకుమార్ నాయకత్వం వహించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులంతా మంగళవారం చెన్నై ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి విజయకాంత్ వైఖరిపై ధ్వజమెత్తారు.
అనంతరం సాయంత్రం వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలను, పది మంది జిల్లా కార్యదర్శులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ప్రకటించారు.
అంతకుముందు, అసంతృప్త నేతలు మాట్లాడుతూ.. పొత్తు విషయంలో విజయ్కాంత్ పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు డీఎండీకేకు ఆత్మహత్యా సదృశమేనన్నారు. దీనివల్ల జయలలితకు లాభం చేకూరుతుందన్నారు. విజయ్కాంత్ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన సతీమణి ప్రేమలత, ఆమె తమ్ముడు సుదీష్లేనని ఆరోపించారు.