Transwoman SI : ఎస్ఐగా ఎంపికైన ట్రాన్స్వుమెన్ శివన్య... ఆమె స్పూర్తితోనే సాధించానని...
తమిళనాడుకు చెందిన శివన్య(30) అనే ఓ ట్రాన్స్వుమెన్ సబ్ ఇన్స్పెక్టర్(SI) ఉద్యోగం సాధించి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలిచారు. గతంలో ఇదే తమిళనాడుకు చెందిన ప్రీతిక యశిని అనే ట్రాన్స్వుమెన్ ఎస్ఐ ఉద్యోగం సాధించగా... ఆమెను స్పూర్తిగా తీసుకుని శివన్య తన కలను నెరవేర్చుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేతుల మీదుగా శివన్య ఎస్ఐ నియామక పత్రాలను అందుకున్నారు.
ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో శివన్య ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ లక్ష్యం చేరుకునేంతవరకూ ఆమె తన సంకల్పాన్ని వీడలేదు. ఉద్యోగం సాధించిన వేళ ఆమె పట్టలేని సంతోషంలో మునిగిపోయారు.ఈ సంతోష సమయాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదని... పట్టుదలతో ప్రిపేర్ అవడం వల్లే ఉద్యోగం సాధించానని చెప్పారు. తన తల్లిదండ్రులు,సోదరులు ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది అన్నారు. తన ఇద్దరు సోదరుల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ అని,మరొకరు పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు.

తమిళనాడులో మొట్టమొదటి ట్రాన్స్వుమెన్ ఎస్ఐ ప్రీతిక యశిని తనకు స్పూర్తి అని శివన్య తెలిపారు. ట్రాన్స్వుమెన్కు ఫ్యామిలీ,సొసైటీ సపోర్ట్ ఉంటే వారు ఉన్నత హోదాకు చేరుకోగలరని.. గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలరని చెప్పారు.
తమిళనాడులోని తిరువాన్నమలై జిల్లాలో ఉన్న పవుపట్టు శివన్య స్వగ్రామం. ఆ జిల్లా నుంచి ఎస్ఐగా ఎంపికైన తొలి ట్రాన్స్వుమెన్ శివన్యనే కావడం విశేషం. కామర్స్లో డిగ్రీ పూర్తి చేసిన శివన్య ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసి పట్టులతో ప్రిపేర్ అయ్యారు. రాత పరీక్షలు,ఫిజికల్ ఈవెంట్స్,ఇంటర్వ్యూలో సత్తా చాటి ఎట్టకేలకు తన డ్రీమ్ జాబ్ను సాధించారు. నిజానికి కరోనా కారణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ... శివన్య ఎక్కడా ఏకాగ్రత కోల్పోలేదు. భవిష్యత్తులో గ్రూప్-1 పరీక్షను క్లియర్ చేసి డీఎస్పీ కావడమే తన ఆశయమని శివన్య వెల్లడించారు.
కొత్తగా ఎంపికైన 968 మంది సబ్ ఇన్స్పెక్టర్లకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవలే నియామకపు పత్రాలు అందజేశారు. వీరిలో శివన్య ఒకరు. తాలూకా పోలీసుస్టేషన్లకు 660 మంది, సాయుధ దళానికి 225 మంది, ప్రత్యేక రక్షణ దళానికి 39 మంది ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications