మహిళా ఐపీఎస్ అధికారికి డీజీపీ లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం... సంచలనం రేపుతున్న కేసు...
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకు కూడా లైంగిక వేధింపుల బెడద తప్పట్లేదు. తాజాగా తమిళనాడులో ఓ మహిళా ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులకు గురైన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. తన సహచర ఉద్యోగి,ఉన్నత హోదాలో ఉన్న పోలీస్ బాస్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సెంట్రల్ జిల్లాల పర్యటన సందర్భంగా ఆమె వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.

ఎవరా అధికారి...?
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నిందితుడు లా&ఆర్డర్ స్పెషల్ డీజీపీ రాజేష్ దాస్ కావడం గమనార్హం. లైంగిక వేధింపులపై ఆ మహిళా ఐపీఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో అతనిపై వేటు పడింది. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం త్వరలో జరగనున్న ప్రధాని పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ రివ్యూ మీటింగ్స్ నుంచి అతన్ని తప్పించింది. దాస్ మాత్రం ఇంతవరకూ ఈ ఆరోపణలపై స్పందించలేదు.

విచారణకు కమిటీ ఏర్పాటు...
రాష్ట్ర ప్లానింగ్&డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జయశ్రీ రఘునందన్ నేత్రుత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.ఐపీఎస్ అధికారులు సీమా అగర్వాల్,అరుణ్,శాముండేశ్వరి,వీకె రమేష్ బాబు,లొరెట్టా జానాలను కమిటీలో సభ్యులుగా నియమించింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై ఈ కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని రాష్ట్ర హోంశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.

ప్రభుత్వంపై డీఎంకె విమర్శలు...
మరోవైపు ప్రతిపక్షాలు ఈ వేధింపుల ఘటనకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. నిందితుడిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని డీఎంకె అధినేత స్టాలిన్ ఆరోపించారు. ఇది అత్యంత అసహ్యకరమని... సిగ్గుచేటని విమర్శించారు. ధైర్యంగా ముందుకొచ్చి సదరు డీజీపీపై ఫిర్యాదు చేసిన ఆ మహిళా ఐపీఎస్కు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో పోలీస్ బాసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇదే తొలిసారి కాదు.

గతంలోనూ ఇదే తరహాలో...
అగస్టు,2018లో అప్పటి తమిళనాడు యాంటీ కరప్షన్,డైరెక్టోరేట్ ఆఫ్ విజిలెన్స్ డైరెక్టర్పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తమిళనాడు మహిళా ఎస్పీ ఒకరు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ స్థాయి అధికారి నేత్రుత్వంలోని కమిటీతో అంతర్గత విచారణ చేపట్టారు. అయితే ఆ కమిటీ నిందితుడికే సహకరిస్తోందని... అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ ఆ మహిళా ఎస్పీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆ కేసు విచారణను అసాధారణ రీతిలో తెలంగాణ పోలీసులకు బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత నెల రోజులకే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.












Click it and Unblock the Notifications