సీఎం పళనిసామి ఢిల్లీకి పరుగు: పన్నీర్ దెబ్బ, ప్రధాని మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సొంత పార్టీలోని నాయకులు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి రంగం సిద్దం చేసుకున్నారు. మోడీతో భేటీ అయ్యి తన పదవిని
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి చెమటలుపడుతున్నాయి. సొంత పార్టీలోని నేతలు అనేక గ్రూపులుగా తయారై ఎక్కడ తన పదవికి ఎసరుపెడుతారో అంటూ రోజురోజుకూ హడలిపోతున్నారు. ఇక లాభం లేదని తెలుసుకున్న పళనిసామి తానూ గ్రూపు రాజకీయాలు చెయ్యాలని నిశ్చయించుకున్నారని తెలిసింది.
శశికళకు అత్యంత సన్నిహితుడైన ఎడప్పాడి పళనిసామి గత కొన్ని నెలలుగా అనేక ఆటంకాలతో తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆయనకు సొంత పార్టీలోనే రోజురోజుకు అసమత్మి పెరుగుతూ వస్తోంది. అయితే శశికళ కుటుంబ సభ్యుల అండతో ఆయన తన సీఎం పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు.

ఢిల్లీకి పరుగో పరుగు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన చెన్నై నుంచి ఢిల్లీ చేరుకుని రాత్రి తమిళనాడు భవన్ లో మకాం వెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తరువాత ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు జరపడానికి సిద్దం అయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీతో భేటి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తమిళనాడు సమస్యలు, డిమాండ్లు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించనున్నారని ఎడప్పాడి పళనిసామి సన్నిహితులు చెబుతున్నారు.

రెబల్ లీడర్ పన్నీర్ సెల్వం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. తమిళనాడు రైతుల రుణాలు మాఫీ చెయ్యాలని, తమిళనాడుకు రావలసిన నిధులు మంజూరు చెయ్యాలని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశారు.

పన్నీర్ సెల్వం దెబ్బతో
అధికారంలో లేకున్నా తనకు బీజేపీ నాయకులతో ఉన్న సానిహిత్యంతో ఇటీవల పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అధికారంలో లేకున్నా పన్నీర్ సెల్వం తమ కోసం ఢిల్లీతో పోరాటం చేస్తున్నారనే సంకేతాలు తమిళనాడు ప్రజల్లోకి వెళ్లే విధంగా పన్నీర్ సెల్వం వర్గం ప్రచారం చేసింది. ఈ దెబ్బతోనే పళనిసామి ఢిల్లీ బయలుదేరారని తెలిసింది.

మోడీతో భేటికి ప్రయత్నించిన సీఎం
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి చాల రోజుల నుంచి ఎడప్పాడి పళనిసామి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూనే వస్తోంది. ఈ విషయం పసిగట్టిన పన్నీర్ సెల్వం గుట్టుచప్పుడు కాకుండా గురువారం అర్దరాత్రి చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని పన్నీర్ సెల్వం వర్గానికి షాక్ ఇచ్చారు.

బీజేపీ చేతీలో రిమోట్
అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం మోడీతో భేటీ అయ్యి వారం పూర్తి కాకముందే తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రధానితో భేటీ అవుతున్నారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ దెబ్బతో అన్నాడీఎంకే రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోకి వెళ్లిందని సమాచారం.

సీఎం కుర్చి కాపాడుకోవడానికే ?
తన సీఎం సీటు కాపాడుకోవడానికి ఎడప్పాడి పళనిసామి ఢిల్లీకి బయలుదేరారని తెలిసింది. ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు వరసదాడులతో శశికళ వర్గం హడలిపోయింది. ఈనేపథ్యంలోనే ఓ సారి ఎడప్పాడి పళనిసామి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

కేవలం రెండు నిమిషాలు !
గతంలో కేవలం రెండు నిమిషాలు మాత్రం మోడీతో మాట్లాడానికి అవకాశం చిక్కడంతో ఎడప్పాడి పళనిసామి వినతి పత్రం సమర్పించడానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్న ఎడప్పాడి పళనిసామి ఏ విషయాల గురించి చర్చిస్తారో వేచిచూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పన్నీర్ సెల్వం వర్గం నిఘా !
ఎడప్పాడి పళనిసామి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం నిఘా వేసిందని సమాచారం. ఎడప్పాడి పళనిసామి తన పదవిని కాపాడుకోవడానికి కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతున్నారా ? మరేమైనా కారణాలు ఉన్నాయా? అంటూ గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications