టార్గెట్ 2024 : సెమీస్ లో గెలుపు..రాష్ట్రపతి ఎన్నిక : మోదీ-షా ఎత్తులు- కొత్తగా "బండి" ఎక్కేనా...!!
కేంద్ర కేబినెట్లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు అందులో మంత్రులుగా పనిచేసిన అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి శాఖలను ఇంఛార్జీలు చూస్తున్నారు. దీంతో వెంటనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 17వ తేదీన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేస్తారనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే బీజేపీ సర్కార్ ఈ ఎన్నికల అంశంతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై కూడా ఫోకస్ చేసింది.

యూపీ పై ఫోకస్
వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అతిపెద్ద రాష్ట్రం బీజేపీకి అన్నివిధాలా అండగా ఉండే రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్పై దృష్టి సారించింది. ఇప్పటికే యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అట్టర్ ఫ్లాప్ కావడం, కోవిడ్ నిర్వహణలో బీజేపీ సర్కార్ విఫలమైందన్న వార్తలు వస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం యోగీ ఆదిత్యనాథ్ను ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరిపింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

కేబినెట్ విస్తరణలో యూపీ, పంజాబ్కు ప్రాధాన్యత
వచ్చే ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కోల్పోతే కేంద్రంలో భారీగా నష్టం తప్పదని భావించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి సారించింది. ఇక అదే సమయంలో పంజాబ్ పైన కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ పార్టీ బీజేపీకి దూరమైంది. దీంతో పంజాబ్లో బీజేపీకి కష్టాలు తప్పేట్టు లేదు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి శిరోమణి అకాళీదళ్ వైదొలిగింది. ఇక కేబినెట్ విస్తరణలో పంజాబ్ రాష్ట్రంకు అధిక ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. ఇక్కడ బీజేపీ నుంచి ఉన్న బలమైన నాయకులకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక ఉత్తర్ ప్రదేశ్నుంచి కూడా ఎక్కువ మందికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గోవా మణిపూర్ రాష్ట్రాలకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ మిత్ర పక్షాలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ కూడా టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ... ఆ రాష్ట్రం నుంచి కూడా పలువురికి కేబినెట్లో చోటు కల్పించాలని భావిస్తోంది.

బండి సంజయ్కు కేబినెట్లో చోటు..?
ఉత్తర్ ప్రదేశ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ తొలి వ్యూహం బీఎస్పీ-ఎస్పీ పార్టీలను విడగొట్టాలి. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అన్ని రాజకీయ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. అదీ కాకపోతే ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రంను ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను రాజ్నాథ్ సింగ్ స్మృతీ ఇరానీలకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇక కేంద్ర కేబినెట్ విషయానికొస్తే 79 మందికి మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 23 ఖాళీలు ఉన్నాయి. వీటిలో కొన్ని రీప్లేస్మెంట్స్ కూడా తప్పదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు కూడా మరో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఎంపీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.

రాష్ట్రపతి ఎన్నికకు ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకం
ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్స్గా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ ఓటమి పాలైతే 2022 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటికి ప్రతిపక్షాలు బలపడుతాయి కనుక వారు నిలబెట్టే అభ్యర్థికి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలపాల్సి ఉంటుంది. 2022 నాటికి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రోల్ కాలేజ్లో బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి చిక్కులు లేకుండా తమకు నచ్చిన అభ్యర్థినే రాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశం ఉన్నింది. ఇప్పటికే శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడు. పంజాబ్, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సహాయంను శరద్ పవార్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఇటు అగ్రనేతలతో, మంత్రులతో, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో వరుస భేటీలు జరుపుతూ ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications