నిన్న ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు...నేడు హాస్పిటల్స్: వీడియోలతో కేజ్రీవాల్పై బీజేపీ దాడి
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇటు బీజేపీ అటు ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారంలో వేడిపుట్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆప్ ప్రభుత్వం చేపట్టరాదన్న కసితో బీజేపీ పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రోజుకో వీడియోను విడుదల చేసి అరవింద్ కేజ్రీవాల్ను ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. నిన్న ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై ఓ వీడియోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేయగా తాజాగా ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితిపై మరో వీడియోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రిలీజ్ చేశారు.
మొహల్లా క్లినిక్స్ పై వీడియో
2015లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ తీసుకొచ్చిన లేదా చేసిన పనులపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు అవి అమలైన తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అయితే వాస్తవ పరిస్థితి ఇలా ఉందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మరో వీడియోను ట్విటర్పై పోస్టు చేశారు. ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి ఎన్నో గొప్పలు చెబుతోందని అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందంటూ పోస్టులో రాసుకొచ్చారు జేపీ నడ్డా.

మొహల్లా క్లినిక్స్ పరిస్థితి దారుణం ఉందన్న నడ్డా
ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేవని ఇందుకు నిదర్శనం ఈ వీడియోలో ఉన్న హాస్పిటల్ పరిస్థితే అని నడ్డా పేర్కొన్నారు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ కొరతతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం హాస్పిటళ్ల మెరుగు కోసం ఏమాత్రం పనిచేస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది వెయ్యి మొహల్లా క్లినిక్స్ను ప్రారంభిస్తారని కేజ్రీవాల్ చెప్పారని అయితే ప్రారంభించిన అతి తక్కువ మొహల్లా క్లినిక్స్లో కనీస సదుపాయాలు లేవని ట్వీట్ చేశారు.
పేదవారిని మోసం చేస్తున్న కేజ్రీవాల్ అన్న అమిత్ షా
ఇక జేపీ నడ్డా ట్వీట్ చేసిన కొద్ది సేపటికే అదే ట్వీట్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రీట్వీట్ చేశారు. ముందు విద్యారంగంలోని కేజ్రీవాల్ వైఫల్యం చూశామని ఇప్పుడు ఆరోగ్యరంగం ఎలా ఉందో చూస్తున్నామంటూ అమిత్ షా కామెంట్ చేశారు. ఢిల్లీలో నివసించే పేదలకు ఇలాంటి క్లినిక్స్లో ఆపరేషన్ నిర్వహిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్ స్వార్థ రాజకీయాల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ యోజన పథకంకు పేదలను దూరంగా ఉంచారని అమిత్ షా ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ చేసిన పాపంకు సమాధానం ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు.

ఫేక్ వీడియోలను విడుదల చేస్తున్నారు: అరవింద్ కేజ్రీవాల్
ఇదిలా ఉంటే అమిత్ షా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలపై బూటకపు వీడియోను విడుదల చేశారని... షాను ప్రచారంలో పాల్గొనకుండా 48 గంటల పాటు నిషేధం విధించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి తప్పుడు వీడియోలను పోస్టు చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలపై అమిత్ షాకు ఎలాంటి ప్రేమ ఉందో బయటపడిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో 1024 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా... కొన్ని ఇబ్బందులున్న పాఠశాలలను మాత్రమే బీజేపీ చూపిస్తోందని అదికూడా తప్పుగా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు కేజ్రీవాల్.












Click it and Unblock the Notifications