Target Mamata:బెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు..?బీజేపీ నయా స్కెచ్..టైగర్ బోన్లో చిక్కేనా..!!
వచ్చే ఏడాదిలో ఉత్తరాఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేవలం గత నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రానికి మూడు ముఖ్యమంత్రి వచ్చాడు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం కారణాలు ఏమైనప్పటికీ మోడీ సర్కార్ అసలు లక్ష్యం మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనే మాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి లింక్ ఏంటనేగా మీ అనుమానం.. మరి అంత స్పష్టంగా తెలిస్తే అక్కడ మోడీ-షా రాజకీయ చాణక్యం ఏముంది..? ఇక్కడ కచ్చితంగా మమతానే టార్గెట్గా బీజేపీ అధినాయకత్వం పావులు కదిపిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆరు నెలల్లోగా అసెంబ్లీకి...
తీరత్సింగ్ రావత్ మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ సమయానికి ఆయన గర్వాల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉండాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుడిగా ఉండాలి లేదా ఆ రాష్ట్ర శాసనమండలిలో అయినా ప్రాతినిథ్యం వహిస్తూ ఉండాలి. ఉత్తరాఖండ్లో శాసనమండలి వ్యవస్థ లేదు. దీంతో తీరత్సింగ్కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ రాష్ట్రంలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలవాలి.
అది కూడా ఆరునెలల్లోగా జరిగిపోవాలి. ప్రస్తుతం తీరత్నాథ్ సింగ్ మార్చి 10వ తేదీన సీఎంగా బాధ్యతలు చేపట్టినందున సెప్టెంబర్ నెలలోగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టాలి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల కమిషన్ గతంలో పేర్కొంది. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాలన్నా కనీసం నెల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. దీంతో ఇది సాధ్యమయ్యే పనికానందున తీరత్సింగ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.

మమతా టార్గెట్గా పావులు కదిపిన బీజేపీ
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ కూడా ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. అయితే ఆమెను బలిచేసేందుకే తీరత్సింగ్ను ముందుగానే ప్లాన్ ప్రకారం బలిపశువును చేశారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని ఈసీ చెబితే.. తీరత్ సింగ్ ఎపిసోడ్ను తెరమీదకు తీసుకొచ్చి మమతాను గద్దె దింపేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఆ పరిస్థితే మమతాకు తలెత్తితే... సొంత పార్టీ నేతను నిబంధనల మేరకు సీఎం కుర్చీ నుంచి తప్పించడం జరిగిందని మమతా బెనర్జీ ఇందుకు మినహాయింపు కాదని బీజేపీ నేతలు డిఫెండ్ చేసుకునే అవకాశాలున్నాయి.
మమతా బెనర్జీ నవంబర్ 5వ తేదీలోగ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదా ఆమెకు అత్యంత నమ్మకస్తులకు సీఎం కుర్చీ కట్టబెట్టి పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే మోదీ- షాల చేతికి అస్త్రం దొరికినట్టే అవుతుంది. అంటే పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం బీజేపీ చేసే అవకాశాలున్నాయి.

పశ్చిమబెంగాల్ పన్నీర్ సెల్వం ఎవరు
ఒకవేళ తన నమ్మకస్తులకు మమతా సీఎం కుర్చీ కట్టబెడితే... పరిస్థితి తమిళనాడులా అవుతుంది. అంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లే ముందు తన సీఎం పదవికి రాజీనామా చేసి ఆమె స్థానంలో పన్నీర్ సెల్వంకు అప్పగించింది. ఆమె జైలు నుంచి విడుదల కాగానే పన్నీర్ సెల్వం తిరిగి అంతే నమ్మకంతో జయలలితకు సీఎం కుర్చీని అప్పగించారు. పశ్చిమ బెంగాల్లో అదే జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈలోగానే చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను మమతా వినియోగించుకోనున్నారు. అటు బీజేపీ మమతా పోటీ చేయబోయే సీటుపై నందిగ్రామ్ తరహా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా ఎప్పటికప్పుడు మమతను సెల్ఫ్ డిఫెన్స్లోకి నెట్టివేయడమే బీజేపీ అసలైన వ్యూహంగా తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలు, గతంలో వచ్చిన సీట్లను నిలబెట్టుకోవడం లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు గెలవటం ద్వారా మమతకు చెక్ పెట్టాలనేది బీజేపీ అంతిమ లక్ష్యంగా ఉంది. మరి మమతా బెనర్జీ ఎపిసోడ్లో బీజేపీ స్కెచ్ ఎలాగుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications