టీసీఎస్ కీలక నిర్ణయం: షేర్ల పున:కొనుగోలుకు బోర్డు ఆమోదం..
కంపెనీ షేర్ హోల్డర్స్ నుంచే పున:కొనుగోలు ప్రతిపాదన వచ్చినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.
న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)షేర్ల పునః కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది. సంస్థకు చెందిన రూ.16వేల కోట్ల షేర్ల పునః కొనుగోలుకు(బై బ్యాక్) ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈక్విటీ షేరుకు రూ.2,850 చొప్పున మొత్తం షేర్లలో 2.85శాతాన్ని కొనుగోలు చేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 5.61కోట్ల ఈక్విటీ షేర్ల పున:కొనుగోలు జరిపేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. కాగా, ఈ షేర్లను రూ.16వేల కోట్లకు మించకుండా కొనుగోలు చేయాల్సి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్(బీఎస్ఈ) ఫైలింగ్ సందర్బంగా టీసీఎస్ తెలియజేసింది.
కంపెనీ షేర్ హోల్డర్స్ నుంచే పున:కొనుగోలు ప్రతిపాదన వచ్చినట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేక తీర్మానం ద్వారా బోర్డు సభ్యులు దీనికి అంగీకారం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. బై బ్యాక్ కొనుగోళ్లను టెండర్ ఆఫ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను రూపొందించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.