నో రిక్రూట్మెంట్లు- శాలరీల్లో కోత: TCSలో ఏం జరుగుతోంది?
TCS Layoffs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా కుదుపులకు లోనవుతోంది. షేక్ అవుతోంది. లేఆఫ్స్ ను ప్రకటించిన రెండు రోజుల్లో ఈ దేశీయ టెక్ దిగ్గజంలో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దీని ప్రభావం అటు టెక్ ఇండస్ట్రీ మొత్తం మీద పడుతోంది.
వేలాదిమంది ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందటే ఈ విషయాన్ని ప్రకటించింది. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించనుంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే కృతివాసన్ తెలిపారు.

ఇందుకు గల కారణాలను వెల్లడించారు. సంస్థ మరింత వేగంగా, భవిష్యత్తుకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ తొలగింపులు మిడిల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతివాసన్ అన్నారు.
ఈ మేరకు మనీకంట్రోల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కార్యకలాపాలు కొనసాగుతున్న అన్ని దేశాల్లోనూ ఈ తొలగింపులు ఉంటాయి. 2026 ఆర్థిక సంవత్సరం. అంటే ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్యకాలంలో ఈ లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతుంది. పని విధానాలు మారుతున్నందున, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సంస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని కృతివాసన్ తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగిస్తున్నామని, భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలను అంచనా వేస్తున్నామని కృతివాసన్ చెప్పారు. ఉద్యోగుల వృద్ధికి, వారి కెరీర్కు ఉపయోగపడే అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
దీని తరువాత అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయా సంస్థలో. లేఆఫ్స్ ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఆ సంస్థ షేర్లు భారీగా క్షీణిస్తోన్నాయి. షేర్ల పతనం రెండో రోజూ కూడా కొనసాగుతూ వస్తోంది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే షేర్లు లోయర్ సర్క్యుట్ కు వెళ్లాయి. మైనస్ లో ట్రేడింగ్ ఆరంభమైంది.
సోమవారం సాయంత్రం రూ.3,079.30 పైసల వద్ద ట్రేడింగ్ క్లోజ్ కాగా.. ఈ ఉదయం రూ.3,067.90 పైసల వద్ద ఓపెన్ అయింది. ఒక్కో షేర్ మీద 12 రూపాయల నష్టంతో ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తరువాత కంటిన్యూగా క్షీణించడం మొదలు పెట్టాయి టీసీఎస్ షేర్ల వేల్యూ. ఉదయం 11:05 నిమిషాలకు గరిష్టంగా రూ.3,047లకు పడిపోయింది.
టీసీఎస్ షేర్ల ధరలు మరింత క్షీణించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఎప్పుడూ లేనివిధంగా టీసీఎస్ కూడా లేఆఫ్స్ ప్రకటించడం.. సంస్థ లావాదేవీలపై ప్రభావం చూపిందని, రిటైల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి.
లేఆఫ్స్ ప్రకటించిన అనంతరం మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది టీసీఎస్ యాజమాన్యం. కొత్త ఉద్యోగాలను నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్కూట్ చేసుకోకూడదని నిర్ణయించింది. అలాగే- వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా పుల్ స్టాప్ పెట్టింది.












Click it and Unblock the Notifications