టీడీపీ ఏపీ బంద్: పలు చోట్ల రోడ్డెక్కిన పార్టీ నాయకులు, అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలకు పూనుకున్నారు. ఆర్టీసీ బస్టాండుల వద్ద భైఠాయించి, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
టీడీపీ నాయకులు, పోలీసులు మధ్య పలుచోట్ల వాగ్వాదాలు జరిగాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అరెస్టులు కూడా చేశారు. నిరసన ప్రదర్శనలు, బస్టాండుల వద్ద ఆందోళనలకు పూనుకున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎంపీ కింజారపు రామ్మెహన్ నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నర్సారావుపేట టీడీపీ నేత అరవిందబాబు అరెస్ట్ సమయంలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది.
ముందస్తు అరెస్టులు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు బంద్ పాటించేందుకు ఆపార్టీ నేతలు సన్నద్ధమవుతుండగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలను రాత్రి నుంచే గృహనిర్బంధంలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు సహా వివిధ ప్రాంతాల్లో నేతలను నిర్బంధించారు.
టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసు బలగాల మోహరింపు
బంద్ కారణంగా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలో దింపారు. అనేక చోట్ల ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. బస్లాండ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపిస్తున్నారు.
టీడీపీ నేతలు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో వారిని నిలువరించే ప్రయత్నం జరుగుతోంది. బస్సులు యధావిధిగా తిరిగేందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.

దాడులతో మాకు సంబంధం లేదు
టీడీపీ ఆఫీసుల మీద జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు తన కార్యకర్తలను ప్రేరేపించి ఈ దాడికి పురిగొల్పినట్టు అనుమానం వస్తోందంటూ ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు.
''టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు నోటి దురుసుతనం ప్రదర్శిస్తే సహించబోము. నక్కా ఆనందబాబును కేవలం సమాచారం మాత్రమే అడిగారు. ప్రభుత్వం మీద, సిఎం జగన్ పైనా పదే పదే బురద చల్లుతున్నారు. టీడీపీ నాయకులు నీచమైన బాష మాట్లాడుతూ, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు వెనకనుండి నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నాం. మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారనే అనుమానం కలుగుతోంది. వ్యక్తి గతంగా దూషించడం, అవమానకరంగా మాట్లాడటం తగదు. డిజిపి ఫోన్ తీయలేదు అనేది అవాస్తవం.. అమరవీరుల పెరేడ్లో డీజీపీ వున్నారు. మొదటి నుండి రాష్ట్ర ప్రతిష్టకు, ముఖ్యమంత్రికి భంగం కలిగేలా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు’’ అని హోం మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
- వరద నీటిలో వంట పాత్రలో కూర్చుని పెళ్లి మండపానికి వెళ్లిన వధూవరులు
- కశ్మీర్లో 'టార్గెట్ కిల్లింగ్స్'.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల ప్రస్తావన ఎందుకొస్తోంది
- చైనా పరీక్షించిన హైపర్సోనిక్ క్షిపణి ఏమిటి? మొత్తం ప్రపంచానికి ఇది ప్రమాదమా
- విక్రాంత్ను ముంచాలని వచ్చిన పాక్ 'ఘాజీ' విశాఖలో జలసమాధి ఎలా అయ్యింది?
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications