Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wakf Bill: రేపు లోక్ సభలో వక్ఫ్ బిల్లు-టీడీపీ మద్దతు-వాటిని వ్యతిరేకిస్తామన్న జేడీయూ..!

వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు ఇవాళ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత 8 గంటల పాటు దీనిపై లోక్ సభలో చర్చించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు లోక్ సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. మరో మిత్రపక్షం జేడీయూ మాత్రం ముస్లింలపై ప్రభావం చూపే సవరణల్ని వ్యతిరేకిస్తామని తెలిపింది.

రేపు లోక్ సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ తమ అభిప్రాయం వెల్లడించారు. వక్ఫ్ బిల్లుకు తాము మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తారని పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని, కాబట్టి రేపు బిల్లు ప్రవేశపెట్టాక తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు మాత్రం ముస్లింలకు అండగా ఉంటారని ఆయన తెలిపారు.

tdp extends support for wakf bill jdu opposing retrospective amendments

ఎన్డీయే మరో మిత్రపక్షం జేడీయూ కూడా వక్ఫ్ బిల్లుపై స్పందించింది. ఈ బిల్లును ముస్లింలపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఆమోదించకూడదని తాము కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు జేడీయూ ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. నితీష్ కుమార్ రాజకీయాల్లో ఉన్నంతవరకూ ప్రజల ప్రయోజనాలను కాపాడతారని ఆయన ఇవాళ ప్రకటించారు.

రేపు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎంత సమయం చర్చించాలన్న దానిపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందులో కొందరు నాలుగు గంటలు చర్చించాలని, మరికొందరు ఆరు గంటలు చర్చించాలని కోరారు. విపక్షాలు 12 గంటలు చర్చించాలని కోరాయి. దీంతో ప్రభుత్వం ఎనిమిది గంటల పాటు దీనిపై లోక్ సభలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.

రేపు లోక్ సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. వారు రేపు అనుసరించాల్సిన వైఖరిపై మార్గదర్శనం చేశారు. ముస్లిం సమాజానికి ఈ బిల్లు ఏ విధంగా మేలు చేస్తుందో జనంలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ బిల్లు మతపరమైన సంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోదనే అంశంపై ముస్లింలకు అవగాహన కల్పించాలన్నారు.

tdp extends support for wakf bill jdu opposing retrospective amendments

మరోవైపు ఇప్పటికే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఓసారి చేతులు కాల్చుకుంది. ఈ ఏడాది జనవరిలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. వెంటనే విపక్షాలతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీంతో వెంటనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాత 15 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ రాష్ట్రాల్లో ముస్లింలతో పాటు పలు వర్గాలతో సంప్రదింపుల తర్వాత తాజాగా కేంద్రానికి తమ నివేదిక ఇచ్చింది. ఇందులో కొన్ని సవరణలను మాత్రం ఉపసంహరించారు. మిగతా సవరణలు అలాగే ఉన్నాయి.

కానీ ముస్లింలు మాత్రం పూర్తిగా బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. అంతే కాదు ఎన్డీయే మిత్రులైన నితీష్ కుమార్, చంద్రబాబు ఇచ్చిన రంజాన్ ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించాలని కూడా పిలుపుఇచ్చింది. దీంతో ముస్లింలు ఈ ఇద్దరు నేతల ఇఫ్తార్ విందులకు దూరంగా ఉండిపోయారు. దీంతో రేపు పార్లమెంట్లో మరోసారి వక్ఫ్ బిల్లు ప్రవేశపెడితే చోటు చేసుకోబోయే పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది.

Take a Poll

వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇప్పటికే విపక్ష ఇండియా కూటమిలో పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టొద్దంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. అయినా కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తుండటంతో గతంలో లాగే రేపు లోక్ సభలో మరోసారి ఈ బిల్లును అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీలోనూ విపక్ష వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించాయి. కానీ లోక్ సభలో ఎంపీలున్న అధికార టీడీపీ, జనసేన మాత్రం ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

వక్ఫ్ చట్టంలోని వివాదాస్పద అంశాలపై ఇప్పటికే ముస్లిం వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలతో చర్చించేందుకు బీజేపీ సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దానికి బదులుగా పార్లమెంట్ లో తమకు ఉన్న మద్దతుతో బిల్లు నెగ్గించుకోవాలనే పట్టుదలతో ఉంది. కానీ రేపు లోక్ సభ సజావుగా జరిగితే తప్ప ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం కనిపించడం లేదు. దీంతో విపక్షాలు ప్రశ్నోత్తరాల తర్వాత ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా ఏ విధంగా అడ్డుకుంటాయన్న దానిపైనా ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు అధికార బీజేపీతో పాటు ఎన్డీయేలోని ఇతర పార్టీలు కూడా రేపు లోక్ సభకు తమ ఎంపీలంతా హాజరయ్యేలా విప్ లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బిజెపి మిత్రపక్షాలు మరియు పార్లమెంటు సభ్యులు సహా అన్ని లౌకిక రాజకీయ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అనుకూలంగా ఓటు వేయవద్దని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. రేపు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, బిజెపి మతపరమైన ఎజెండాను నిరోధించడానికి దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ అన్ని లౌకిక పార్టీలు మరియు పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు వివక్ష మరియు అన్యాయంపై ఆధారపడి ఉండటమే కాకుండా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25 మరియు 26 కింద ఉన్న ప్రాథమిక హక్కుల నిబంధనలకు ప్రత్యక్షంగా విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+