ఆ మట్టి, నీరు.. మోడీకే తిరిగిచ్చేస్తా: ఎంపీ శివప్రసాద్, రైతు వేషంలో పార్లమెంట్ వద్ద హల్చల్...
Recommended Video
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు చేస్తోన్న ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. రోజుకో వేషధారణలో పార్లమెంట్కు వస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తోన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బుధవారం రైతు వేషంలో వచ్చారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు రైతు వేషంలో ఉన్న శివప్రసాద్ను పలకరించగా, ఆయన 'మోడీగారు ఎక్కడుంటారండీ..' అని అచ్చం అమాయక రైతులా తన నిరసన తెలిపారు. అంతేకాదు, శివప్రసాద్.. ఒక కుండలో మట్టి, మరో కుండలో నీరు ఉన్న కావడి భుజాన వేసుకుని వచ్చారు.
అదేమని అడిగితే, తమ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ తమకు మట్టి, నీరు ఇచ్చారని.. ఇప్పుడు వాటిని ఆయనకే తిరిగి ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. 'నాలుగేళ్ల క్రితం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు.. వేల కోట్ల రూపాయల సహాయం ప్రకటిస్తారేమోనని ఆశపడ్డామని, కానీ ఆయన మట్టి, నీరు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని..' శివప్రసాద్ చెప్పారు.
'పోనీలే.. మిత్రపక్షంలో ఉన్నాం కదా.. తరువాతైనా ఏదైనా మేలు చేయకపోతారా? అని ఎంతోకాలంగా ఎదురుచూస్తుంటే కేంద్రం తమను పట్టించుకోవడమే లేదని, అందుకే ఆయనిచ్చిన మట్టి, నీరుతిరిగి ఆయనకే ఇచ్చేస్తాం. వీటిని స్పీకర్ కు అందించి, ఆమె ద్వారా ప్రధానికి పంపించాలని కోరుతాం... ఒకవేళ ఆయన తీసుకోకపోతే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెట్టేస్తాం..'అని పేర్కొన్నారు.
అలా కావడిని మోస్తూ పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ శివప్రసాద్ను మెట్లు వద్దే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటి వాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందికి వచ్చేశారు.