అంతర్జాతీయ ఉగ్రవాదిగా కన్నడ టెక్కీ
బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తూ.. భారత ఉపఖండంలో ఉగ్రవాదులను నియామకాలు జరుపుతున్నప్రధాన రిక్రూటర్ మహ్మద్ షఫీ అర్మర్(30)ను అమెరికా గురువారం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్.. అమెరికా, ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసి ఉంది. ఈ క్రమంలో అమెరికా ఈ సంచలన నిర్ణయం ప్రకటించడంతో భారత్ విజయం సాధించినట్లయింది.
భారత్లోని ప్రతి రాష్ట్రంలో అతను ఇస్లామిక్ స్టేట్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడని నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రత్యేకంగా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాను తాజా పర్చిన అమెరికా కోశాగార విభాగం అందులో అర్మర్ పేరును చేర్చింది. దీంతో అతనిపై ఆర్థిక ఆంక్షలను విధించడానికి వీలవుతుంది.
కర్ణాటకలోని భత్కల్కు చెందిన అర్మర్కు చోటే మౌలా, అంజన్ భాయ్, యూసుఫ్ అల్ హిందీ అనే మారు పేర్లు చాలా ఉన్నాయి. ఒసామా అతర్, మహ్మద్ అల్ బినాలిని కూడా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2015, నవంబరులో పారిస్లో, 2016 మార్చిలో బ్రసెల్స్ ఉగ్రదాడులకు అతర్ సూత్రధారి. ఈ దాడుల్లో 162 మంది మరణించారు. బినాలి.. బహ్రెయిన్కు చెందిన వాడు. ఇస్లామిక్స్టేట్లో చేరాల్సిందిగా అతను అక్కడిన పోలీసులను, సైనికులను ప్రేరేపిస్తున్నాడు.

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై భారత బలగాలు దాడులు చేసిన నేపథ్యంలో అర్మర్ తన అన్నతో కలిసి పాకిస్థాన్కు పారిపోయాడు. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ సహా భత్కల్ సోదరులతో విభేదాలు రావడంతో అన్సర్ ఉల్ తాహిద్ అనే సంస్థను అర్మర్ ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ సంస్థ.. ఇస్లామిక్ స్టేట్కు మద్దతు పలికింది. ప్రస్తుతం అతను అఫ్గానిస్థాన్ లేదా సిరియా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
స్వయంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన అర్మర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తాడు. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలో యువకులను ఇస్లామిక్స్టేట్ కోసం నియమించుకోవడానికి ఫేస్బుక్, ఇతర వ్యక్తిగత మెసెంజర్ సేవల ద్వారా సంప్రదిస్తుంటాడు. వారికి ఉగ్రవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షణ కల్పించి జంద్ ఉల్ ఖల్ఫియా ఎ హింద్ అనే సంస్థ కోసం నియమించుకుంటున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications