Tejas express: తొలి ప్రైవేటు రైలు భారీ పరిహారం -2గంటల ఆలస్యానికి రూ.4.5లక్షలు :irctc ప్రకటన
ఆలస్యానికి అమ్మంటూ ఉంటే అది రైల్వేసే అని, ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని.. ఇండియన్ రైల్వేపై బోలెడన్ని జోకులున్నాయి. ఎవరేమనుకున్నా ఆ సంస్థ మాత్రం దేశ ప్రజలకు సేవలందించడంలో ఏనాడూ రాజీ పడలేదు. ఒక గంట అటు ఇటైనా తక్కువ ధరలోనే అందరినీ గమ్యానికి చేర్చాయి, చేర్చుతున్నాయి. రాసుకుంటే డేటా నిండిపోయేంత ఘన చరిత్రగల రైల్వేస్ పరిస్థితి కొంతకాలంగా ఇంకాస్త దిగజారుతూ వచ్చింది. కరోనా పుణ్యాన ప్రజలు రైలు ప్రయాణాలనే మర్చిపోయే దుస్థితి దాపురించింది. సరిగ్గా ఈ దశలోనే రైల్వే ప్రైవేటీకరణ కూడా జోరందుకుంది. ప్రభుత్వ ఆధీనంలో కంటే ప్రైవేటు నిర్వహణలో ప్రయాణికులకు ఎంత మేలు జరుగుతుందో తెలియజెప్పేలా తేజస్ ఎక్స్ ప్రెస్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది..
వందల మంది ప్రయాణికులు ఫ్లాట్ ఫారంపై ఎదురు చూస్తుంటారు.. టైమ్ దాటిపోయినా రైలు ఎంతకీ రాదు.. ఫలానా రైలు ఫలానా ఫ్లాట్ ఫామ్ కు రావడం ఆశించనైనదనే ప్రకటనలు తప్ప నిజంగా రైలు ఆలస్యానికి గల కారణాలు ప్రయాణికులకు తెలియజేయరు.. ఆలస్యానికి పరిహారం అనే మాట రైల్వేస్ లో లేనే లేదు. అలా ఇచ్చుకుంటూ పోతే వచ్చే ఆదాయాని కంటే ఇచ్చే పరిహారమే ఎక్కువైపోతుంది మరి. అయితే ఇదంతా ప్రభుత్వ నిర్వహణ ముచ్చట. అదే రైలు ప్రైవేటువాడిదైతే.. ఆలస్యానికి చింతనతోపాటు ప్రయాణికులకు పరిహారం కూడా ఇస్తున్నారిప్పుడు. దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఐఆర్సీటీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది..
తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు రెండున్నర గంటలు ఆలస్యమైనందుకు అందులోని మొత్తం 2035 మంది ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ఏకంగా రూ.4.5 లక్షల పరిహారం చెల్లించనుంది. ఢిల్లీ-లక్నో మధ్య నడిచే ఈ రైలు.. శని, ఆదివారాల్లో మూడు ట్రిప్పులు కలిపి మొత్తం రెండున్నర గంటలు ఆలస్యమైంది. శనివారం భారీ వర్షాల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఫెయిలవడంతో తేజస్ ఎక్స్ప్రెస్ ఆలస్యమైంది. ఆదివారం కూడా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే ఈ రైలు గంట ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రైవేటు నిబంధన ప్రకారం..
ఇండియాలో తొలిసారిగా ఓ రైలు ఆలస్యమైతే పరిహారం చెల్లించే నిబంధన తేజస్ ఎక్స్ప్రెస్ విషయంలో ఉంది. రైలు గంట ఆలస్యమైతే రూ.100, రెండు గంటలు, అంతకంటే ఎక్కువైతే రూ.250 పరిహారం ఒక్కో ప్రయాణికుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శనివారం తేజస్ ఎక్స్ప్రెస్ ఆలస్యమైనందుకు అందులోని 1574 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున మొత్తం రూ.3.93 లక్షలు, ఆదివారం ఆలస్యమైనందుకు అందులోని 561 మంది ప్రయాణికులు ఒక్కొక్కరికి రూ.150 చొప్పున ఈ రైలును ఆపరేట్ చేస్తున్న ఐఆర్సీటీసీ చెల్లిస్తుంది.
విమానంలాంటి వసతులతో తొలి తేజస్ ఎక్స్ప్రెస్ 2019, ఆగస్ట్ 4న లక్నో నుంచి ఢిల్లీ వెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో గంటలోపు రైలు ఆలస్యమైన సందర్భాలు ఐదుసార్లు మాత్రమే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆలస్యం కాదని ఐఆర్సీటీసీ చెబుతోంది. గత రెండేళ్లలో ఐఆర్సీటీసీ ఇంత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావడం ఇదే తొలిసారి. గత శీతాకాలంలోనూ ఇలాగే రైలు రెండు గంటల ఆలస్యం కాగా.. అందులోని 1500 మంది ప్రయాణికులకు పరిహారం చెల్లించారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు బాగుటుందనే భావన ప్రజల్లో కల్పించడానికే ఈ పరిహారం నిబంధన పెట్టారని, రైల్వే మొత్తం ప్రైవేటు చేతికి వెళ్లాక ఏ పదో, పరక్కో పేదవాడు ప్రయాణాలు చేయలేని పరిస్థితులు వస్తాయని ప్రైవేటీకరణ వ్యతిరేకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.