‘‘పధ్నాలుగేళ్ల ప్రాయంలో అవినీతా? ఎఫ్ఐఆర్ రాజకీయ కుట్రే, రాజీనామా ప్రసక్తే లేదు’’
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్విప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు.
పాట్నా: ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్విప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు.
అవినీతి కేసుల విషయంలో వివరణ ఇవ్వాలని అధికార జేడీయూ డిమాండ్ చేసిన నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ రాజకీయ కుట్ర...
హోటళ్లకు భూమి కేసులో ఎఫ్ఐఆర్ రాజకీయ కక్షలో భాగమే. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. నాపైనా, నా కుటుంబసభ్యులపైనా కుట్రలు పన్నుతున్నారు అని తేజస్విప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.
లాలూజీ అంటే వాళ్లకు భయం...
లాలూజీ అంటే బీజేపీ వాళ్లు భయపడుతున్నారనే విషయం అందరికీ తెలుసు. అయితే 28 ఏళ్ల యువకుడికి కూడా ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదు. 14 ఏళ్ల బాలుడు కనీసం మీసాలు కూడా రాని వయసులో అవినీతికి పాల్పడ్డాడంటే మీరు నమ్ముతారా? అని తేజస్వియాదవ్ ప్రశ్నించారు.
నేను వెరీ క్లీన్... అదే నకిలీ ఎఫ్ఐఆర్...
తాను అధికారం చేపట్టిన తొలిరోజు నుంచి చక్కగా పని చేశానని, అవినీతిని సహించలేదని, కర్తవ్య నిర్వహణలో ఎటువంటి తప్పులు చేయలేదంటూ తేజస్వి యాదవ్ తనను తాను సమర్థించుకున్నారు. బీజేపీయే అధికారంలోకి వచ్చిన తర్వాత తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. తనపై మోపిన ఎఫ్ఐఆర్ నకిలీ అంటూ తేజస్వి మండిపడ్డారు.
Recommended Video
కూటమి కొనసాగుతుంది... ప్రజల వద్దకు వెళతా...
మహాకూటమి కొనసాగుతుందని, దానిని ఎవరూ ముక్కలు చేయలేరని రాష్ట్ర రహదార్ల నిర్మాణం తదితర శాఖలను కూడా నిర్వహిస్తున్న తేజస్వి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు. లాలూప్రసాద్యాదవ్... రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాంచి, పూరి స్టేషన్లలో హోటళ్లను నడుపుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రతిఫలంగా 2004లో వారికి పట్నాలో మూడు ఎకరాల భూమిని నిర్వాహకులు ఇచ్చారనేది సీబీఐ ఆరోపణ.
అల్లుడినీ ప్రశ్నించిన ఈడీ...
రూ. 8 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేష్కుమార్ను కూడా ఎన్ఫోర్స్ మెంట్ విభాగం (ఈడీ)బుధవారం ప్రశ్నించింది. వాస్తవానికి శైలేష్కుమార్ని సోమవారమే విచారించాల్సి ఉంది. అయితే ఆయన ఆరోజు రాకపోవడంతో మరోసారి సమన్లు పంపారు. దీంతో శైలేష్ బుధవారం ఈడీ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలమిచ్చారు.