టీ బిల్లుపై ట్విస్ట్: అది ద్రవ్య బిల్లు అవుతుందా?
ద్రవ్య బిల్లు ఏది విషయంపై రాజ్యాంగంలోని 110(1) అధికరణలో స్పష్టమైన వివరణ ఉంది. ద్రవ్య బిల్లులను తప్పనిసరిగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదం పొంది, తమ ముందుకు వచ్చిన 14 రోజుల్లోపు రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఒక బిల్లు ద్రవ్యబిల్లో, కాదో తేల్చే విషయంపై తుది నిర్ణయం స్పీకర్కే ఉంటుంది. ఈ విషయంలో స్పీకర్ ఎవ్వరినీ సంప్రదించాల్సిన అవసరంలేదు.స్పీకర్ 'ఇది ద్రవ్యబిల్లు' అని ధ్రువీకరిస్తే ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. ద్రవ్య బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనకు పంపే అవకాశం ఉండదు. అలాగే ద్రవ్య బిల్లు వేరు, ఆర్థిక బిల్లు వేరు.
తెలంగాణ బిల్లులోనూ సీమాంధ్రకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుత రూపంలో చూస్తే ఇది ద్రవ్య బిల్లు కాదు. సీమాంధ్రకు ఇచ్చే ప్యాకేజీలను బిల్లులో ప్రతిపాదించలేదు కాబట్టి అది ద్రవ్య బిల్లు కిందికి రాదని కేంద్ర మంత్రి చిదంబరం వాదిస్తున్నారు.
అయితే, ఇది ద్రవ్య బిల్లే అని, ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం కుదరదని సీమాంధ్ర నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బిజెపి కూడా అదే వాదనను ముందుకు తెచ్చింది. సీమాంధ్రకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి విభజన బిల్లులో ప్రతిపాదనలు మాత్రమే ఉన్నాయని, నిర్దిష్టమైన కేటాయింపులు చూపించి తీరాలని బిజెపి పట్టుబడుతోంది. నిర్దిష్టమైన కేటాయింపులు చేస్తే మాత్రం ఇది ద్రవ్య బిల్లు అవుతుంది.
రాజ్యసభలో బిల్లును గట్టెంచుకోవడం ప్రభుత్వానికి సులభం. రాజ్యసభలో బిజెపి మద్దతు ఇవ్వకపోయినా బిల్లు గట్టెక్కే పరిస్థితి ఉంది. యుపిఎ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం తొలుత దాన్ని రాజ్యసభలో ప్రతిపాదించాలని భావించింది. కానీ, దానికి బిజెపితో పాటు సీమాంధ్ర నేతలు అడ్డుపడే ప్రయత్నం చేశారు. చివరకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కూడా అడ్డు చెప్పడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు.
తెలంగాణ బిల్లును ద్రవ్య బిల్లుగా తేల్చిన తర్వాత కూడా చిదంబరం తన వాదనకే కట్టుబడి ఉన్నారు. అది ద్రవ్య బిల్లు కాదని, వారెందుకు అలా సలహా ఇచ్చారో తెలియదని ఆయన అంటున్నారు. స్పష్టమైన కేటాయింపులు లేకపోవడం వల్ల ద్రవ్య బిల్లు కిందికి రాదనేది ఆయన వాదన.