ఉత్కంఠ: తెలంగాణ బిల్లు మొదట లోకసభలోనే?
న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బిల్లు రాజకీయాలతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కింది. రాజ్యసభలో తొలుత ప్రతిపాదించాలనే యుపిఎ ప్రభుత్వ ప్రతిపాదనపై చైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే కాకుండా బిజెపి కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా లోకసభలోనే బిల్లును ప్రవేశపెట్టాలనే ఆలోచనకు యుపిఎ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. అందుకు ప్రణబ్ ముఖర్జీ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంపై చర్చించేందుకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు లోకసభ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే తేదీని ఆ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బుధవారం లేదా గురువారం బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెసు, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వ్యూహరచన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు.












Click it and Unblock the Notifications