అందరి దృష్టీ ఆయన మీదే: మహారాష్ట్ర గవర్నర్ కోష్యారితో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు.. భగత్ సింగ్ కోష్యారి. మహారాష్ట్ర గవర్నర్. వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలనలో కొనసాగిన ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించారాయన. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామాల్లో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.
అందరి దృష్టీ ఆయన మీదే..
బీజేపీ సీనియర్ దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. రాష్ట్రపతి పాలనకు తెర దించారు. ప్రస్తుతం అందరి దృష్టీ ఆయన మీదే నిలిచింది. శని, ఆదివారాల్లో దేశ రాజధాని వేదికగా కొనసాగిన గవర్నర్ల సదస్సులో కూడా ఓ రకంగా చెప్పాలంటే భగత్ సింగ్ కోష్యారి.. సెంటర్ ఆఫ్ ద టాపిక్ అయ్యారు. గవర్నర్ల సదస్సులో ఆయనను అభినందించని వారు లేరు.
కోష్యారిని మర్యాదపూరకంగా కలిసిన తమిళిసై
ఇదే సదస్సునకు హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆదివారం సాయంత్రం గవర్నర్ల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మహారాష్ట్ర గవర్నర్ ను మర్యాదపూరకంగా కలిశారు. ఆయనతో కలిసి ఫొటో దిగారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఉత్కంఠభరితమైన ముగింపును ఇచ్చారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి మచ్చ రాని విధంగా, చాకచక్యంగా వ్యవహరించారని తమిళిసై.. ఈ సందర్భంగా భగత్ సింగ్ కోష్యారిని ప్రశంసించినట్లు తెలుస్తోంది.
29 రాష్ట్రాల గవర్నర్లు, లెప్టినెంట్లు..
రాష్ట్రపతి భవన్ లో రెండురోజుల పాటు కొనసాగిన ఈ అత్యున్నత సదస్సునకు దేశంలోని 29 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళిసై సౌందర రాజన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు ఈ సదస్సులో తమ అనుభవాలను పంచుకున్నారు.
గిరిజన సమస్యలే ప్రధానాంశంగా..
దేశవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానాంశంగా గవర్నర్ల సదస్సును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. గిరిజనులకు అందించాల్సిన కనీస సౌకర్యాలపై చర్చించారు. మంచినీరు, విద్యుత్, రవాణా, రోడ్లు, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలపై రాష్ట్రపతి భవన్ లో రెండురోజుల పాటు ఈ సదస్సు కొనసాగింది. సమావేశం ముగిసిన అనంతరం గవర్నర్లందరూ రామ్ నాథ్ కోవింద్, నరేంద్ర మోడీతో రాష్ట్రపతి భవన్ లో గ్రూప్ ఫొటో దిగారు.