టీపై వెనక్కి వెళ్లం, సీమాంధ్రకు ప్యాకేజీ: నేతలతో డిగ్గీ
"అసెంబ్లీ తీర్మానం ఉంటుందని తొలుత చెప్పారు. ముసాయిదా బిల్లు వస్తుందని చెప్పారు. ఇప్పుడు రోజుకోమాట మాట్లాడుతున్నారు. తీవ్ర గందరగోళం నెలకొంది'' అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని రాష్ట్రపతితో భేటీ తర్వాత ఆయన విమర్సించారు. 2009 డిసెంబర్ 9 ప్రకటనలో అసెంబ్లీ తీర్మానం ఉంటుందని చిదంబరం చెప్పారని, తీర్మానాన్ని పంపాల్సిందేనని మంత్రి గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.
దానికి సమాధానంగా - చాలా దూరం వచ్చేశామని, విభజన విషయంలో ఇక వెనక్కి పోలేమని దిగ్విజయ్ తేల్చి చెప్పారు. సంప్రదాయాలు, పద్ధతులను పాటించేలా చూస్తామని, సీమాంధ్రకు 'బెస్ట్ డీల్'ను ఇస్తామని హామీ ఇచ్చారు. శనివారం షిండేతో భేటీ అవుతున్నానని, తీర్మానంపై అప్పుడు షిండేను కనుక్కుంటానని, అసెంబ్లీకి తీర్మానాన్ని పంపించడానికి ప్రయత్నిస్తానని, కానీ వస్తుందో లేదో పూరిస్థాయిలో చెప్పలేనని ఆయన అన్నారు. బిల్లు మాత్రం తప్పనిసరిగా వస్తుందని దిగ్విజయ్ చెప్పారు.
సీమాంధ్రకు ఆర్థికంగా మంచి ప్యాకేజీ ఇస్తామని, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామని వివరించారు. హైదరాబాద్లోని సీమాంధ్ర ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని, సీమాంధ్ర విద్యార్థులకు హైదరాబాద్లో విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని, ఇరు ప్రాంతాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు ఎంత బాగా కృషి చేయాలో అంత బాగా కృషి చేస్తానని దిగ్విజయ్ హామీ ఇచ్చారు.