రాష్ట్ర విభజన తర్వాత 45 రోజుల్లో ఏపికి రాజధాని
పిటిఐ కథనం ప్రకారం.. విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిని ఉమ్మడి రాజధానిగా పరిగణిస్తారు. సీమాంధ్ర ప్రాంత రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు ఓ కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఆ కమిటీ 45 రోజుల్లోగా కొత్త రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తుంది.
కొత్త రాజధాని నిర్మాణం కోసం అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్, హై కోర్టు, ప్రభుత్వ సచివాలయం, శాసనసభ, శాసనమండలి మొదలైన ముఖ్య భవనాల నిర్మాణాలను కేంద్రమే చేపడుతుంది. రాజధాని కోసం డీ నోటిఫైడ్ అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉంటారు. రాజధాని ప్రాంతంలోని ప్రజలకు సంబంధించిన రక్షణ వ్యవహారాలను ఆయన చూస్తారు. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఉన్నత స్థాయికి మండలిని ఏర్పాటు చేస్తుంది. రెండు రాష్ట్రాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపడుతుంది.