అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితురాలు ఆస్పత్రిలో కన్నుమూయగా... కుటుంబ సభ్యులకు కనీసం ఆమె ఆఖరి చూపైనా దక్కకుండా చేశారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా బిడ్డకు చివరి వీడ్కోలు చెప్పే అవకాశమైనా లేకుండా చేశారని మృతురాలి తల్లి బోరున విలపిస్తున్నారు. మరోవైపు అక్కడి స్థానికులు బాధితురాలు తమ కుటుంబం కోసం ఎంత కష్టపడి పనిచేసేదో... ఆమె ఎలా ఉండేదో చెబుతూ కంటతడి పెట్టుకుంటున్నారు.

ఆమెకు ఇల్లే ప్రపంచం...
'ఆ యువతి కుటుంబం కోసం చాలా కష్టపడేది. ఆమెకు ఆమె ముగ్గురు అక్కాచెల్లెళ్లే స్నేహితులు.. ఇల్లే ప్రపంచం. ఎప్పుడూ ఇంట్లో ఉండేందుకే ఇష్టపడేది. ఇంటి పనులతో పాటు పొలం పనులకు కూడా వెళ్లేది. గేదెల పాలు పితికేది... అన్ని పనుల్లోనూ ఇంట్లో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండేది..' అని స్థానికులు చెప్పారు. పశుగ్రాసం కోసం తల్లితో కలిసి రోజూ పొలానికి వెళ్లేదని... ఇంటికొచ్చాక అందరికీ తనే వంట చేసేదని తెలిపారు.

అమ్మకు ఏడవద్దని చెప్పండి...
తల్లి,చిన్న అన్నతో ఆమెకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేదని స్థానికులు తెలిపారు. ఆఖరికి ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉన్న సమయంలోనూ కుటుంబ సభ్యుల గురించే ఆమె ఆరాటపడిందని చెప్పారు. ఆస్పత్రి బెడ్పై ఉండి కూడా కుటుంబ సభ్యులతో పాటు,ఊరి గురించి ఆరా తీసిందన్నారు. అంతేకాదు.. 'అమ్మకు ఏడవద్దని చెప్పండి.... నేను త్వరలోనే ఇంటికి తిరిగొస్తాను...' అని చెప్పిందంటూ ఆమె బంధువు ఒకరు కన్నీటిపర్యంతమయ్యారు.

యువతి పొరుగింట్లోనే సందీప్...
19 ఏళ్ల ఆ యువతి వాల్మీకి కమ్యూనిటీకి చెందినది. కేవలం 3 తరగతి వరకు మాత్రమే చదువుకుంది. హత్రాస్లోని ఆమె ఇంటికి 100మీ. దూరంలో ఉన్న బూల్గర్హిలో చదువుకుంది. ఆ ప్రాంతంలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ అగ్రవర్ణాలకు చెందినవారే. నిందితుల్లో ఒకరైన సందీప్ సింగ్(22) ఆ యువతి పొరుగింట్లోనే ఉంటాడని పోలీసులు గుర్తించారు. ఆ యువతి అందంగా ఉండటంతో సందీప్ ఆమెపై కన్నేశాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఓసారి ఆ యువతి కుటుంబం సందీప్ వ్యవహారాన్ని అతని కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందంటున్నారు. కానీ వాళ్ల మాటలను సందీప్ ఫ్యామిలీ పట్టించుకోలేదన్నారు.
Recommended Video

న్యాయం చేస్తామన్న సీఎం...
హత్రాస్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. జరిగిన ఘటనపై విపక్షాల నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసింది. మరోవైపు,వేగవంతమైన విచారణ కోసం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ ఘటనపై సిట్తో విచారణకు ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications