ఉదయం ఉక్కపోత.. రాత్రుళ్లు వేడి సెగలు.. ఇవేం ఎండలు బాబోయ్..!
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం, దానికి తోడు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించనప్పటికీ పలుచోట్ల ఉష్ణోగ్రతలు 47 నుంచి 48డిగ్రీల మధ్య నమోదువుతున్నట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

పెరుగుతున్న వడదెబ్బ బాధితులు
ఎండ తీవ్రత ఎంత ఉన్న రోజువారీ పనులు చేసుకునే కూలీల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా ఉపాధిహామీ కూలీలు ఎండలు దంచికొడుతున్నా పని మానే పరిస్థితి లేదు. వీరితో పాటు మధ్యాహ్నం సమయాల్లో ఆఫీసులకెళ్లే ఉద్యోగాలు వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో పలు ఆస్పత్రులకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. వడదెబ్బకారణంగా ఇప్పటి వరకు వంద మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

రాత్రిళ్లు ఉక్కపోతతో ఇబ్బందులు
ఉదయం ఎండలు దంచికొడుతుంటే రాత్రిళ్లు వేడి సెగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుండటంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సోమవారం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 45 నుంచి 45.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు పలుచోట్ల వడగాలులు వీచాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, హన్మకొండ, భద్రాచలం, హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఏపీలో 46డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువయ్యాయి. సోమవారం నెల్లురులో గరిష్ఠంగా 45.9డిగ్రీలు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మిగితా ప్రాంతాల్లో 44నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డైంది. ఏపీలో మంగళవారం వడగాలుల తీవ్ర పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.

తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు
తెలంగాణలో మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని ఐఎండీ చెప్పింది. అయితే దక్షిణ కర్నాటక, దాన్ని ఆనుకుని ఉన్న రాయలసీమలో 1.5కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ కర్నాటక వరకు, దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ఫలితంగా తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగాల్పులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications