కాశ్మీర్ వరదల్లో తెలుగు విద్యార్థులు, ఏపీ సాయం
హైదరాబాద్: జమ్ము కాశ్మీర్ వరదల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. కాశ్మీర్ వరదల్లో గల్లంతైన వారిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చెందిన సాయి కార్తీక్, ఒంగోలుకు చెందిన వంశీరామ్, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండకు చెందిన మధుసూదన్, హైదరాబాదుకు చెందిన శ్రీనిధి రెడ్డి, షాజాలు ఉన్నారు. వీరితోపాటు ఫస్టియర్ విద్యార్థులు కూడా ఉన్నరు. గల్లంతైన వారు శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు. తెలుగు విద్యార్థులు పన్నెండు మంది వరకు గల్లంతైనట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం
జమ్ముకాశ్మీర్ వరదల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రూ.5 కోట్ల వరద సాయం ప్రకటించింది. జమ్మూకు 300 మెట్రిక్ టన్నుల ఆహారపదార్థాలను పంపాలని నిర్ణయించింది. 145 మెట్రిక్ టన్నుల ఆహార ప్యాకెట్లను విమానం ద్వారా ఇప్పటికే పంపించింది.
జమ్మూ కాశ్మీర్ వరదలు దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలను కలచివేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి సహాయం చేసేందుకు వివిధ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ వరద బాధితుల సహాయార్దం రూ. 5 కోట్లు ప్రకటించగా, మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు, బీహార్ ప్రభుత్వం రూ. 10 కోట్లు ప్రకటించాయి.
జమ్ము కాశ్మీర్ వరదలు
జమ్ము కాశ్మీర్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 50 వేల మందిని రక్షించారు. మరో 6 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
జమ్ము కాశ్మీర్ వరదలు
వరద బారిన పడి కల్లోలంగా మారిన కాశ్మీరంలో సహాయక చర్యలు ముమ్మరమాయ్యయి. త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జమ్ము కాశ్మీర్ వరదలు
జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 61 హెలికాఫ్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. 250 బోట్లను వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్ తర్వాత అంతటి ప్రకృతి విలయం చవిచూసిన జమ్మూకశ్మీర్ లో సహాయ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.
జమ్ము కాశ్మీర్ వరదలు
ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో జనాన్ని తరలించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అయితే కాశ్మీర్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జమ్ము కాశ్మీర్ వరదలు
వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యం మామూలు జనానికి ఇవ్వడం లేదంటూ ఆగ్రహం చెందుతున్నారు. లక్షల మంది నిరాశ్రయులైన ప్రకృతి విలయం నుంచి జనాన్ని కాపాడేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రీపగలు తేడా లేకుండా పనిచేస్తున్నాయి.
జమ్ము కాశ్మీర్ వరదలు
రాజధాని శ్రీనగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంచడంతో సహా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎటు చూసిన జలమే కనిపిస్తూ.. జనం నిలబడేందుకు చోటు దొరకడం లేదు.