మార్చి నుంచే భానుడి భగ భగలు.. ఒక్కసారిగా మారిన వాతావరణం..
నిన్న మొన్నటి వరకు చలి గాలులు వీచాయి. చలి కూడా ఉంది. అయితే వాతావరణం మెల్లగా మారింది. అవును రాత్రి పూట కాదు.. ఉదయం, సాయంత్రం.. మధ్యాహ్న వేళల్లో కూడా ఎండకాలం మొదలైంది. వాస్తవానికి ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండల తీవ్రత కనిపించేది. కానీ ఈ సారి కాస్త లేటుగానే వేసవి తీవ్రత ప్రారంభం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది.
వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది. గత రెండు రోజులుగా రాత్రివేళలో చలి తీవ్రత తగ్గి గాలిలో తేమ శాతం పెరిగిందని వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో గల హైదరాబాద్, జహీరాబాద్ సహా మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు మేర పెరిగినట్లు వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా.. గరిష్టంగా 33-34 డిగ్రీలకు చేరుకుంది. మార్చి మొదటి వారం నుంచే దేశంలో ఎండల తీవ్రత పెరగనుందని ఐఎండీ అంచనా వేసింది. సాధారణంగా ఫిబ్రవరి -మార్చి మధ్య పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 19-20 డిగ్రీలుగా నమోదు అయ్యేవి. అయితే ఈసారి తక్కువ ఎత్తులో వీస్తున్న ఉత్తర-వాయువ్య గాలుల కారణంగా వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో రాత్రిళ్ళు కొంత ఉక్కపోత.. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఈ సారి ఏప్రిల్- మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.