12 గంటల్లో ఇద్దరు నేతల హత్య: అట్టుడుకుతున్న కేరళ అలప్పుజా.. 144 సెక్షన్ విధింపు
కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత 12 గంటల్లో ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. SDPI నేత కేఎస్ ఖాన్ హత్య జరిగింది. ఆ తర్వాత బీజేపీ నేత రంజిత్ శ్రీనివాస్ కూడా హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఇంట్లో చొరబడి
ఆదివారం శ్రీనివాస్ ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. ఇతను ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా. రంజిత్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలప్పుజా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇటు కేఎస్ షాన్ పై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మన్నన్ చేరి వద్ద షాన్ బైక్పై వెళుతుండగా కారుతో ఢీ కొట్టారు. అనంతరం అతనిపై దాడికి తెగబడటంతో తీవ్రంగా గాయపడ్డారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో..
ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని ఎస్డీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి దృష్ట్యా అలప్పుజా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ తెలిపారు. రెండు హత్యలపై సీఎం పినరయి విజయన్ ఖండించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.
హింసకు తావులేదు
రాష్ట్రంలో హింసకు తావులేదని సీఎం పినరయి విజయన్ అన్నారు. హింసకు పాల్పడిన వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారని.. వారికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఘటనకు మీరంటే మీరే కారణం అని బీజేపీ, ఎస్డీపీఐ నేతలు ఆరోపించుకుంటున్నారు. గత 60 రోజుల్లో మూడో బీజేపీ నేత దారుణ హత్య జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అస్థిర పరిచేందుకు పీఎఫ్ఐ గుండాలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటనలను కేంద్రమంత్రి వీ మురళిధరన్ కూడా ఖండించారు. హత్యలు మాత్రం రాష్ట్రంలో దుమారం చెలరేగింది.