టి నోట్: ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత, కావూరి డిసెంట్?
న్యూఢిల్లీ: కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని నివాసంలో కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. ఈ భేటీలో తెలంగాణ నోట్ పెట్టే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో పలువురు సీమాంధ్ర విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నివాసంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. భద్రతా సిబ్బంది అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సమైక్య విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ఆపకుంటే సీమాంధ్ర రావణ కాష్టం అవుతుందని, అనర్థాలు వస్తాయని హెచ్చరించారు. సమైక్య నిర్ణయం రాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.
టేబుల్ ఐటమ్గా...
ఈ నెల 9వ తేది నుండి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కేబినెట్ ఆమోదం పొందే ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ నోట్ను తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ అంశాల్లో తెలంగాణ నోట్ లేకున్నప్పటికీ అది టేబుల్ ఐటంగా తీసుకురానున్నారు.
కాగా, టేబుల్ ఐటంగా తెలంగాణ నోట్ వస్తే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు పళ్లం రాజు, కావూరి సాంబశివ రావులు డిసెంట్ వ్యక్తం చేసే అవకాశముంది. కేబినెట్కు నోట్ వస్తే తాము తిరస్కరిస్తామని కావూరి సాంబశివ రావు ఉదయం చెప్పారు.