జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ దారుణహత్య!!
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకాల నేపధ్యంలో అలర్ట్ ప్రకటించి, భద్రతా బలగాలు అడుగడుగునా పహారా కాస్తున్నప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ను కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. కాశ్మీరీ పండిట్ లను టార్గెట్ చేసి హత మారుస్తున్న ఉగ్రవాదులు తాజాగా షోపియాన్ జిల్లాలో ఓ కాశ్మీరీ పండిట్ ను అత్యంత దారుణంగా హతమార్చారు.
శనివారం జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో యాపిల్ పండ్ల తోట లోకి వెళుతున్న కాశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలోని అతని నివాసం సమీపంలో పూరన్ క్రిషన్పై దాడి చేశారు ఉగ్రవాదులు. ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన అతనిని షోపియాన్ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అప్పటికే క్రిషన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వారు తెలిపారు. ప్రస్తుతం షోపియాన్ లోని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు, దుండగులను పట్టుకోవడం కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
గత ఆగస్టులో షోపియాన్ జిల్లాలోని ఆపిల్ తోటలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ ను హతమార్చారు. 45 సంవత్సరాల కాశ్మీరీ పండిట్ సునీల్ కుమార్ నాడు ఉగ్రవాదుల దుశ్చర్యకు బలి కాగా, అతని సోదరుడు గాయపడ్డాడు. అంతకుముందు బుధవారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ హత్యకు గురయ్యారు గత ఏడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్ల వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు కాశ్మీరీ పండిట్ ను హతమార్చడం జమ్మూకాశ్మీర్ పోలీసులకు, భద్రతా బలగాలకు పెను సవాల్ విసురుతోంది.