కరోనా విజృంభణ: రాష్ట్రాలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ కీలకం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టి పెట్టాలని ఆదేశించింది.
ఏప్రిల్ 1 నుంచే కేంద్రం నూతన మార్గదర్శకాలు
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం విడుదల చేసిన కీలక మార్గదర్శకాలివే.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలని, పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలి. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేపట్టాలి.
కరోనా నిబంధనలు పాటించాల్సిందే.. ఆంక్షలూ
బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి. మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే, రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరుకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది.
కంటైన్మెంట్ జోన్లు.. నిబంధనలతోనే సంస్థలు
పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చాలి. కంటోన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు నిర్వహించాలి. కంటోన్మెంట్ జోన్ బయట అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది. అయితే, ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎన్ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Recommended Video
వ్యాక్సినేషన్కు ప్రాధాన్యతివ్వండి..
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను మనదేశంలో ప్రారంభించామని, అయితే, ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చైన్ను విడగొట్టాలంటే టీకాను ఆధారమని స్పష్టం చేసింది. అందుకే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్పై మరింత దృష్టిపెట్టాలని, అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ డోసులు వేయించుకునేలా చూడాలని స్పష్టం చేసింది. కాగా, దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3 లక్షలు దాటిన విషయం తెలిసిందే.