రూ.10కోట్లు ఇవ్వాల్సిందే: ఐఏఎస్ అధికారికే బెదిరింపులు, డిటెక్టివ్ జంట అరెస్ట్
ముంబై: ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏకంగా ఓ ఐఏఎస్ అధికారిని బెదిరింపులకు గురిచేసి రూ.10కోట్లు డిమాండ్ చేశాడు. అతని అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో సదరు అధికారి రూ. కోటి ఇచ్చాడు. అయితే, అంతకుముందే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ డిటెక్టివ్ కటకటాలపాలయ్యాడు.
మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రైవేట్ డిటెక్టివ్ సతీశ్ మంగల్, అతడి భార్య శ్రద్ధ(టీవీ నటి).. ఓ ఐఏఎస్ అధికారిని బెదిరించి రూ.కోటి వసూలు చేస్తుండగా అవినితి నిరోధక విభాగం (ఏఈసీ) పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందిత దంపతులిద్దరని అరెస్టు చేసినట్లు వారు పోలీసులు వెల్లడించారు.
గతంలో రాధేశ్యాం మోపల్వార్ అనే ఐఏఎస్ అధికారి ఫోన్ సంభాషణలను మంగల్ దంపతులు రికార్డు చేశారని.. వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు మోపల్వార్ను రూ.7 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో ఓ భూవివాదంలో మోపల్వర్ పాత్రకు సంబంధించి ఆడియో రికార్డింగులు బయటకిరావడంతో.. అతడిని రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (ఎమ్ఎస్ఆర్డీసీ) వైస్ఛైర్మన్, ఎండీ పదవుల నుంచి ప్రభుత్వం తొలగించింది.

కాగా, మంగల్ తనను బెదిరించిన ఘటనను రహస్యంగా వీడియో తీసి మోపల్వార్ ఇటీవల ఏఈసీని ఆశ్రయించారు. దీంతో మంగల్ను పట్టుకునేందుకు ఏఈసీ అధికారులు పక్కా ప్రణాళిక వేశారు. మోపల్వార్ తరపు మనిషిగా మారువేషంలో ఉన్న ఓ పోలీసును పంపి.. రూ.కోటి నగదును మంగల్ దంపతులకు అందజేశారు. దాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే వారిని అరెస్టు చేశారు.
పదో తరగతి వరకు చదువుకున్న మంగల్సీనియర్ ప్రభుత్వ అధికారులతో సంబంధాలు పెంచుకునేవాడని.. వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడేవాడని తెలిపారు. గతంలోనూ అతడిపై కొన్ని కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుల నుంచి కీలక సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్న రెండు ల్యాప్ ట్యాప్లు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు పెన్ డ్రైవ్లు, 15 సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు థానే పోలీసులు వెల్లడించారు.
నిందితులకు మరో ఇద్దరు సహకరించారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications