థరూర్, పాక్ జర్నలిస్టు లింక్స్పై కేరళ అసెంబ్లీలో రభస
తిరువనంతపురం: పాకిస్థాన్ జర్నలిస్ట్తో కేంద్రమంత్రి శశి థరూర్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేరళ అసెంబ్లీ గురువారంనాడు దద్దరిల్లింది. పాక్ జర్నలిస్ట్కు శశిథరూర్ గల సంబంధాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయా అని ప్రతిపక్షాలు నిలదీశాయి.
ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి రమేశ్ చెన్నితల సమాధానమిస్తూ.. శశిథరూర్పై వచ్చిన ఆరోపణలన్ని మీడియా వార్తలేన్నారు. సునంద పుష్కర్ మరణంపై శశి థరూర్ను విచారించాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి.
పాకిస్తాన్ జర్నలిస్టుతో శశిథరూర్కు సంబంధాలున్నాయనే ఆరోపణలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయా అని శాసనసభ్యుడు జేమ్స్ మాథ్యూ అడిగారు. మీడియా వార్తకథనాలు మాత్రమే వచ్చాయని, అధికారికమైన వివరణలు ఏవీ రాలేదని హోం మంత్రి రమేష్ చెన్నితల చెప్పారు. అయితే, అధికారిక సభ్యులు ప్రతిపక్షాల ఆరోపణలపై తీవ్రమైన అభ్యంతరం తెలిపారు.
శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మరణంపై విచారణ జరిపించాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఎఐసిసి అధికార ప్రతినిధిగా శశి థరూర్ నియమకాన్ని వామపక్షాలు ప్రశ్నించాయి. అది పార్టీ అంతర్గత వ్యవహారమని, దాని గురించి సభలో ప్రస్తావించడం సరి కాదని స్పీకర్ జి. కార్తేకియన్ స్పష్టం చేశారు.
అనుమానాస్పద కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా అనే విషయంపై పోలీసులు సోషల్ మీడియాను పరిశీలిస్తన్నట్లు చెన్నితల చెప్పారు. అలాంటివి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. కాగా ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అస్థికలు శుక్రవారం త్రివేణి సంగమమ్లో కలుపనున్నారు.