ఆ బంధం దృఢమైంది..
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ బంధం ఎంత ద్రుఢమైందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైంది. స్థానికి సమావేశాల్లో మోదీ పట్ల కేసీఆర్ ఎంత పరుష పద జాలం ఉపయోగించినా, దూషించినా, అనుచిత వాఖ్యలు చేసినా అవి పరస్పర అవగాహనలో భాగమని తేలిపోయింది. కాంగ్రెస్, బీజెపి పార్టీలకు వ్యతిరేకంగా కేసీఆర్ మొదలు పెట్టిన థర్డ్ ఫ్రంట్ కూడా నామమాత్రమే నని తెలిసిపోయింది. కేంద్రంతో సఖ్యత లేదన్న గులాబీ నాయకుల ఆరోపణలకు కూడా ప్రధాని మోది ఏకవాఖ్యంతో సమాధానం ఇచ్చారు. మోదీ, కేసీఆర్ ఎప్పుడూ ప్రేమను పంచుకుంటారనే అంశాన్ని పార్లమెంట్ వేదికగా నొక్కి వక్కానించారు మోది.
ముజే బస్ ప్యార్ చాహియే అన్న కేసీఆర్ మాటకు కట్టుబడి ఉన్న మోదీ..
ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు లోక్ సభ సాక్షిగా తెలంగాణ సీఎం కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం రాజకీయాలు చేస్తుంటే, తెలంగాణ సీఎం కెసీఆర్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. దీని ద్వారా మోడీ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఓ ���ైపు రాష్ట్ర బిజెపి నాయకులు కెసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే, సాక్ష్యాత్తూ మోడీ లోక్ సభలో కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఏపీకి ‘ప్రత్యేక హోదా' కు మద్దతు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు తాజాగా ‘రివర్స్ గేర్' వేసారు. అలా మద్దతు ఇస్తే మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న ఉద్దేశంతో వీరు వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు..అంతే కాదు ఓటింగ్ కు కూడా దూరంగా ఉన్నారు. ఇదంతా మోదీ కనుసన్నల్లో జరిగినట్టు కూడా వార్తలొస్తున్నాయి.
ఒక ఒరలో రెండు కత్తులు.. అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్న కేసీఆర్...
బిజెపికి, ఎంఐఎంలు బద్ద శత్రువులు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ..అటు బిజెపి, ఇటు ఎంఐఎం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీ��ర్ కే మద్దతు ప్రకటిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చ సమయంలో ఎంపీ వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాలను వెనక్కి ఇచ్చేయాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. పోనీ ఈ డిమాండ్ కోసం ఏమైనా టీఆర్ఎస్ గత కొంత కాలంగా ఏమైనా ఉద్యమాలు చేస్తుందా...కేంద్రంపై ఒత్తిడి చేస్తుందా? అంటే అదీ లేదు. గతించిపోయిన విషయాన్ని అకస్మాత్తుగా తెరమీదకు తెచ్చి ఏపి ఎంపీలను అవాక్కయ్యేలా చేసారు గులాబీ ఎంపిలు.
టీ ఎంపీలు ప్రత్యేక హోదా పై మోకాలడ్డటం బీజెపి మంత్రమే..
స్వయంగా కెసీఆర్ మొదలుకుని..కవిత వరకూ పలుమార్లు ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు. కానీ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాత్రం ఏపీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తే ఊరుకునేదిలేదని వినోద్ సభలో ప్రకటించారు. దీంతో ఎక్కడి నుండో నరకడం ఎందుకు పక్కనున్న పొరుగు రాష్ట్రంతోనే మొదలు పెడితే పోలా అన్నట్టు వ్యవహరించింది బీజెపి. టీఆర్ఎస్, బిజెపిల స్నేహగీతం ఎప్పటినుంచో ఉన్నా, అవిశ్వాస తీర్మానం సమయంలో మరోసారి ఇది బహిర్గతం అయింది.
పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ కేసీఆర్, మోదీ స్నేహం..
ఒక ప్రశ్నకు వంద సమాధానాలు అన్నట్టు లోక్ సభలో మోదీ ప్రసంగం తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి బాటలు వేస్తే., గులాబీ పార్టీ బలోపేతానికి తోడ్పడింది. రాష్ట్ర బీజెపితో సంబందాలు ఎంత దారుణంగా ఉన్నప్పటికి కేంద్రంతో మాత్రం కేసీఆర్ చెక్కు చెదరని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని పదే పదే చెప్పుకొస్తున్న స్థానికి నేతలకు మాత్రం మోదీ కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తడం కంటిలో నలుసులా పరిణమించింది. మొత్తానికి పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగంతో మోదీ, కేసీఆర్ బంధం ద్రుఢమైందనే సంకేతాలు వెలువడ్డాయి.