శశికళకు చెక్: ఢిల్లీలో పన్నీర్ సెల్వం, 61 పేజీల లేఖతో !
శశికళ ఇచ్చిన ఉత్తరంపై పన్నీర్ సెల్వం తన వాదనను 61 పేజీల ఉత్తరం ద్వారా ఎన్నికల కమిషన్ కు పంపించారు. మొత్తం మీద ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ ఇరు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఎంతమాత్రం చెల్లదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. తన ఎంపికపై ఇప్పటికే శశికళ ఎన్నికల కమిషన్ కు వివరణ ఇచ్చారు.
శశికళ ఇచ్చిన ఉత్తరంపై పన్నీర్ సెల్వం తన వాదనను 61 పేజీల ఉత్తరం ద్వారా ఎన్నికల కమిషన్ కు పంపించారు. ఐదేళ్లపాటు సభ్యత్వం లేనందున శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని పన్నీర్ సెల్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
తనను ప్రతిపాదించిన వారే ఇప్పుడు మీకు ఫిర్యాదు చేశారని శశికళ ఎన్నికల కమిషన్ కు 70 పేజీల ఉత్తరం ద్వారా ఇచ్చిన వివరణలో పన్నీర్ సెల్వం వర్గంపై ఆరోపణలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ను మీరు కొట్టివేయాలని శశికళ ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.
శశికళ ఇచ్చిన వివరణకు మీరు బదులివ్వాలని ఎన్నికల కమిషన్ పన్నీర్ సెల్వంను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు పన్నీర్ సెల్వం 61 పేజీల వివరణను రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ తో పాటు ఈ వర్గంలోని ఎంపీలు ఎన్నికల కమిషన్ కు అందేజేశారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రెండాకుల గుర్తు తమకే ఇవ్వాలని పన్నీర్ సెల్వం బుధవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు మనవి చేయనున్నారు. ఇప్పటికే శశికళ వర్గం రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని ఈసీకి మనవి చేసింది.
అయితే రెండాకుల గుర్తు ఎవ్వరికనేది ఈసీ నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది. రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని మనవి చెయ్యడానికి పన్నీర్ సెల్వం బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మొత్తం మీద ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంటూ ఇరు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.