షీనా హత్య కేసులో కీలక మలుపు: శవం ఆమెదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపినా షీనాబోరా (24) హత్య కేసులో త్వరలో చార్జ్ షీటు వేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు. షీనాబోరా హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని అధికారులు చెప్పారు.
ముంబై నగర శివార్లలోని రాయ్ గఢ్ అటవి ప్రాంతంలో లభ్యం అయిన మృతదేహం షీనాబోరాదే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదికను సీబీఐ అధికారులకు అప్పగించారు.
ఈ రిపోర్టు ఆధారంగా షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె కారు డ్రైవర్ శ్యామ్ వర్ సింగ్ లపై చార్జీషీటు నమోదు చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.
2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా హత్యకు గురైంది. షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీయా, సంజీవ్ ఖన్నా, శ్యామ్ వర్ సింగ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కోర్టు ఈ ముగ్గురికి ఈ నెల 20వ తేది వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
దక్షిణ ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో ఈ ముగ్గురి మీద చార్జ్ సీటు సమర్పిస్తామని, ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్షాలు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే షినాబోరాను తానే హత్య చేశానని ఇంద్రాణి ముఖర్జీయా అంగీకరించిందని సీబీఐ అధికారులు తెలిపారు.