దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. పలు వేదికల నుంచి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు, అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయని, అయితే ఏ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే వామపక్ష తీవ్రవాదం కూడా తగ్గుముఖం పట్టిందని, దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావం ఉన్న జిల్లాలు 2014లో 70 ఉండేవని, 2021కి ఈ సంఖ్య 46కు పడిపోయిందని మంత్రి వెల్లడించారు.
దేశంలో తమిళనాడు నుంచి మధురై కేంద్రంగా కొత్త రాష్ట్రం, మహారాష్ట్రలో విదర్భ కేంద్రంగా, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్, బీహార్ లో.. ఇలా పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. గతంలో కొత్త రాష్ట్రాలను బీజేపీ హయాంలోనే ఏర్పాటు చేయడంతో మరోసారి ఆ తరహా ప్రతిపాదనలున్నాయనే విషయమై విపక్షాలు ప్రశ్నలు సంధించాయి. అయితే అటువంటివేమీ లేవంటూ కేంద్రం స్పష్టతనివ్వడంతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనే అంశం పాతబడిపోయినట్లుగా భావించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధరల పెరుగుదలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత చర్చిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చుకుంటే ధరల పెరుగుదలను, ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అడ్డుకుందని వివరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ధరల పెరుగుదలతోపాటు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వడ్డింపునకు సంబంధించి విపక్షాలు నిరసనలకు దిగుతూ ఉభయ సభలను స్తంభింప చేస్తున్నాయి.